Sunday, August 28, 2011

న్యూస్: రెండు హిట్లు, రెండు ఫ్లాపులు!

ఇప్పటివరకు నాలుగు సినిమాల్ని డైరెక్ట్ చేసిన సురేందర్‌రెడ్డి రెండు హిట్లు, రెండు ఫ్లాపులతో బ్యాలెన్స్‌గా ఉన్నాడు. తొలి సినిమా 'అతనొక్కడే', నాలుగో సినిమా 'కిక్'తో హిట్లు కొట్టిన అతను రెండు, మూడు సినిమాలైన 'అశోక్', 'అతిథి'లతో ఫ్లాపులు చవిచూశాడు. ఇప్పుడతను తన ఐదో సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా 'ఊసరవెల్లి'. అఫిషియల్‌గా ఆ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ హీరో. ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి 'అశోక్' చేశారు. ఆ సినిమాతో పరాజయం పొందిన వాళ్లు 'ఊసరవెల్లి'తో ఆ చేదు అనుభవాన్ని మరచిపోవాలని ఆశిస్తున్నారు. విపరీతమైన వయొలెన్స్, ఏమాత్రం కొత్తదనం లేని కథ వల్లనే 'అశోక్' ఫ్లాపయ్యిందని సురేందర్‌రెడ్డి గ్రహించాడు. అందుకే 'ఊసరవెల్లి'ని 'కిక్' తరహాలోనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నాడు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. ఎన్టీఆర్, తమన్నా మధ్య వచ్చే సీన్లు యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తాయని ఆ సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సురేందర్‌కి పర్మనెంట్ రైటర్‌గా మారిన వక్కంతం వంశీ కథని అందించిన ఈ సినిమాకి 'బృందావనం' ఫేం కొరటాల శివ డైలాగ్స్ రాస్తున్నాడు. ఇదివరకు ఎన్టీఆర్ 'రాఖీ'కి సూపర్బ్ మ్యూజిక్‌నిచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి బాణీలనిస్తున్నాడు. 'ఛత్రపతి ప్రసాద్' నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా పేరుపొందిన మోడల్ విద్యుత్ జామ్వాల్, రాంగోపాల్‌వర్మ సినిమా 'కాంట్రాక్ట్' ఫేం ఆద్విక్ మహాజన్ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. మొత్తానికి 'ఊసరవెల్లి'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాలనే సురేందర్‌రెడ్డి తపని ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

No comments: