Sunday, August 7, 2011

మన చరిత్ర: తెలుగునాట ఆభ్యుదయ రచయితల సంఘ ఆవిర్భావం

1936 నాటికి తెలుగుదేశంలో కమ్యూనిస్టు భావాలు ప్రచారంలో ఉన్నాయి. అబ్బూరి రామకృష్ణారావు తదితరులు మొదట ఏర్పడ్డ కమ్యూనిస్టు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. సాహిత్యపరంగా భావ కవిత్వం ఉచ్ఛ దశలో ఉంది. నవ్య సాహిత్య పరిషత్తు ఆరంభమైంది. కొత్త గాలులు వీస్తున్నాయి. 'ప్రతిభ' పత్రిక మొదలైంది. భాషాపరంగా గిడుగు రామ్మూర్తి ఉద్యమం తీవ్రదశకెళ్లింది. చలన చిత్రాలు ఆవిర్భవించాయి. రాజకీయంగా ఫ్యూడలిజం భావాలున్న పక్షాలు జాతీయ వ్యతిరేక వైఖరితో నగ్నంగా తెలుగు జనం ముందు నిల్చున్నాయి. దిన పత్రికా రచనలో మార్పూ మొదలైంది. ఇలాంటి రంగంలో కొత్త తాత్విక చింతన, సమసమాజ భావాలు, తెలుగునాట మొలకెత్తాయి.
1938-39 లలో కాంగ్రెస్ సభలకొచ్చిన రచయితలనుద్దేశించి సరోజినీ నాయుడు ప్రసంగించింది. దేశవ్యాప్తంగా అభ్యుదయ రచయితల సంఘ నిర్మాణానికి రాష్ట్రాలకు బాధ్యుల్ని ఆ సభ నిర్ణయించింది. అందులో క్రొవ్విడి లింగరాజు, తుమ్మల వెంకటరామయ్యకు ఆంధ్ర ప్రాంతం కేటాయించారు. వీరు తెలుగుదేశంలో తిరిగి రచయితల్ని అభ్యుదయ రచయితల సంఘ నిర్మాణానికి సుముఖులుగా చేయడం ఆరంభించారు. రెండవ ప్రపంచ యుద్ధం రావడం, నాజీ భావాల్ని తిరస్కరించాలన్న భావానికి దృఢత్వం కలగడంతో పాటు, సోషలిజం రావాలన్న ఆశయం కూడా రచయితల్లో వేళ్లూనింది. దేశ స్వాతంత్ర్యం అనే అంశం మీద భావకవిత్వం రాసేవారూ, వామపక్ష భావాలున్న రచయితలూ అందరూ సమైక్యమయ్యారు. 1942 డిసెంబరులో అభ్యుదయ రచయితల మహాసభలకు ఆహ్వాన సంఘం ఏర్పడి ప్రచారం ఆరంభించింది. కవితా సమితిలోని వాళ్లూ, నవ్యసాహితీ పరిషత్తులోని వాళ్లూ, అప్పటివరకూ ఏ సంఘంలోనూ సభ్యులుగా లేనివాళ్లూ, కమ్యూనిస్టు భావాలున్న రచయితలూ, కవులూ ఈ సంఘ స్థాపనలో కలిసొచ్చారు. 1943లో తెనాలిలో ఫిబ్రవరి 3, 4 తేదీల్లో మొదటి మహాసభలు జరిగాయి. తాపీ ధర్మారావు అధ్యక్షత వహించారు. 61 మంది సభ్యులుగానూ, 34 మంది ప్రతినిథులుగానూ హాజరయ్యారు. రాయిస్టులుగా ఉండే గోపీచంద్, బైరాగి వంటివాళ్లు సభలో గొడవచెయ్యాలని చూశారు. సభలకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచారు. కానీ స్థానికులు రావి అమ్మయ్య తదితరులు వాళ్ల ఆటల్ని సాగనివ్వలేదు. నిరాటంకంగా సభలు జరిగాయి. ఈ సభలకు శ్రీశ్రీ హాజరు కాలేదు.
రిఫరెన్స్: ఆంధ్ర అభ్యుదయ రచయితల మహాసభల సంచిక, 1943 మార్చి.

1 comment:

kothapalli Ravibabu said...

తెనాలి లో మొదటి అరసం సభలు 1943 ఫెబ్రవరి 13, 14 తేదీలలో జరిగాయి. 3,4 తేదీలు కాదు.