Saturday, August 13, 2011

న్యూస్: చిరంజీవికి 'ఠాగూర్', మరి రాంచరణ్‌కి?

'బద్రినాథ్' తర్వాత రాంచరణ్‌ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు వి.వి. వినాయక్. సూపర్ హిట్ సినిమా 'కృష్ణ' తర్వాత అతను డైరెక్ట్ చేసిన 'అదుర్స్', 'బద్రినాథ్' సినిమాలు రెండూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వక పోవడంతో రాంచరణ్‌తో చేసే సినిమాతో ఎలాగైనా పెద్ద హిట్టు కొట్టాలని అతను తపిస్తున్నాడు. ఈ కాంబినేషన్‌తో సినిమా వుంటుందని రెండు నెల్ల క్రితమే నిర్మాత డి.వి.వి దానయ్య ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పక్కా స్క్రిప్టు సిద్ధమైంది. వినాయక్ తీసిన 'లక్ష్మీ', 'కృష్ణ'తో పాటు బోయపాటి శ్రీను రూపొందించిన 'తులసి'కీ రచయితగా పనిచేసిన ఆకుల శివ ఈ సినిమాకి మంచి కథతో పాటు డైలాగ్ వెర్షన్‌నీ సిద్ధం చేశాడు. రాంచరణ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న 'రచ్చ'లో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో పూర్తి కానున్నది. ఈలోగా ఈ ఆగస్టులోనే రాంచరణ్, వినాయక్ కాంబినేషన్ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నది. రెగ్యులర్ షూటింగ్ మాత్రం 'రచ్చ' షూటింగ్ పూర్తయ్యాకే జరుగుతుంది. 'ఆరెంజ్' వంటి డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం ప్రయోగాలకి కామాపెట్టి, మాస్ ఎంటర్‌టైనర్స్‌తో అభిమానుల్ని అలరింపజేయాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల మాట. చిరంజీవికి 'ఠాగూర్' వంటి హిట్టిచ్చిన వినాయక్, ఇప్పుడు చరణ్‌కి అంతకంటే పెద్ద హిట్టునిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. చూద్దాం.. వినాయక్ ఏం చేస్తాడో...

No comments: