Saturday, August 27, 2011

న్యూస్: తెలుగు సినిమాలో శ్రీలంక అందం!

ఓ తెలుగు సినిమా ద్వారా తొలిసారిగా ఓ శ్రీలంక అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఆ సినిమా 'మిస్టర్ రాస్కెల్' కాగా, ఆ అమ్మాయి నదీషా హేమమాలి. చక్కని ముఖ వర్చస్సు, మంచి ఫిజిక్ ఉన్న నదీషా ఈ సినిమాలో పరుచూరి రవీంద్రనాథ్ సరసన నటించింది. ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించిన ఆమెకి ఆడిషన్ నిర్వహించి ఈ సినిమాకి ఎంపిక చేశారు రచయితలు పరుచూరి బ్రదర్స్. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె మనోజ్ సినిమా 'ప్రయాణం' ద్వారా పరిచయమైన పాయల్ ఘోష్ అలియాస్ హారిక. ఇప్పటివరకు ప్రోమోస్‌లో పాయల్ స్టిల్సే ఎక్కువగా కనిపిస్తూ వచ్చాయి. అయితే దీనికి నదీషా పెద్దగా బాధ పడటం లేదు. "ఈ సినిమాలో ప్రేమ కోసం తపించే మధుమతి అనే ఇంపార్టెంట్ కేరక్టర్ చేశా. హీరోతో షేర్ చేసుకున్న ఓ ఇంటిమేట్ సీన్‌ని మర్చిపోలేను. ఆ సీనులో అడవిలో ఓ పాము నా పక్క నుంచి జరజరా పాక్కుంటూ వెళ్తుంది. నేను భయంతో హీరోని కావలించుకుంటా" అని ఆమె తెలిపింది. తెలుగు వాళ్లు చాలా ఆదరాభిమానాలు చూపిస్తున్నారనీ, అయితే తెలుగు భాష పలకడం తనకి కాస్త కష్టంగా ఉందనీ నిజాయితీగా చెప్పింది ఈ సింహళీ బ్యూటీ. తమిళ దర్శకుడు ఆర్.వి. ఉదయశంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి బ్యాడ్ టాక్ నడుస్తున్నా నదీషా మాత్రం అందరి దృష్టిలో పడింది. రానున్న రోజుల్లో ఆమె మరికొన్ని తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

No comments: