Thursday, September 1, 2011

న్యూస్: డైరెక్టర్లకి దాసరి విజ్ఞప్తి

చిత్రసీమలో దర్శకుడిదే ఎప్పుడూ పైచేయిగా ఉండాలని 150 సినిమాలతో ప్రపంచ రికార్డ్ సృష్టించిన దాసరి నారాయణరావు తరచూ చెబుతుంటారు. దీంతో పాటు డైరెక్టర్లకి ఆయనో విజ్ఞప్తి కూడా చేస్తున్నారు.
"సినిమాల సక్సెస్ రేటు తగ్గిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది వ్యక్తులు థియేటర్లు లీజుకు తీసుకుని రూపాయికి ఇంకో రూపాయి లాభం వేసుకుని రెంటు వసూలు చేస్తూ నిర్మాతల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఇంతకుముందు పెద్ద హీరోల సినిమా విడుదలైన రెండు వారాల పాటు టిక్కెట్ రేటు పెంచితే దాని వల్ల లాభం జరుగుతుందని అనుకుని ఆ పద్ధతికి మద్దతు పలికారు. తెలియక వారు చేసిన ఈ పని వల్ల థియేటర్ల రెంట్లు పెరిగాయి. రెంటల్ సిస్టం వల్ల ఎన్నో మంచి సినిమాలు నాశనం అవుతున్నాయి. పర్సంటేజ్ విధానం అమలు చేసే విషయంలో ప్రతిసారీ మోసం జరుగుతోంది. ఇప్పుడు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మొదటి నుంచి నా నినాదం ఒక్కటే. దర్శకుడిదే ఎప్పుడూ పైచేయిగా ఉండాలి. దానిని ఆచరణలో పెట్టి చూపిస్తున్న ఈనాటి దర్శకుల్ని చూసి నేను గర్వపడుతున్నా. పెద్ద హీరోలు సైతం దర్శకుడి మీద ఆధారపడేలా చేసిన ఇప్పటి టాప్ డైరెక్టర్లను అభినందిస్తున్నా. అయితే ఒక విషయం. ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తేనే సినిమా బాగా వస్తుందనే అభిప్రాయాన్ని మార్చుకోండి. ఆ రోజుల్లో మేం 40 రోజుల్లో తీసిన సినిమాని మీరు 80 రోజుల్లో తియ్యండి. అంతేకానీ 250 రోజులు తీసి నిర్మాతని ఇబ్బంది పెట్టకండి. నిర్మాణ వ్యయం తగ్గించడం దర్శకుల చేతుల్లో ఉన్న పని. విమర్శిస్తున్నానని అనుకోకుండా ఆత్మావలోకనం చేసుకుని సినిమాల సక్సెస్ రేటు పెంచమని చెబుతున్నా" అని ఆయన చెప్పారు.

No comments: