Saturday, September 24, 2011

న్యూస్: దున్నేస్తున్న 'దూకుడు'

విడుదలకు ముందే అనేక రికార్డుల్ని సొంతం చేసుకున్న మహేశ్ 'దూకుడు' టైటిల్‌కి పూర్తి న్యాయం చేకూరుస్తూ తొలిరోజు కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుని సృష్టించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ థియేటర్లలో విడుదలైన రికార్డుని సొంతం చేసుకున్న 'దూకుడుకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ప్రేక్షకుల స్పందన కూడా అనూహ్యంగానే ఉంది. తొలిరోజు 'మగధీర' రికార్డుల్ని 'దూకుడు' అధిగమించిందనేది ట్రేడ్ రిపోర్ట్. మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'పోకిరి' రికార్డుల్ని ఈ సినిమా మూడు నుంచి నాలుగు వారాల్లో అధిగమిస్తుందని అంచనాలు వేస్తున్నారు. జి. అజయ్‌కుమార్ ఐపియస్ పాత్రలో మహేశ్ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉండటంతో కనీసం 15 నుంచి 20 నిమిషాల నిడివి తగ్గించాలని విమర్శకులు సూచిస్తున్నా ట్రెండ్ చూస్తుంటే లెంగ్త్ అనేది పెద్ద సమస్యగా కనిపించడంలేదు. 'పోకిరి' తర్వాత మహేశ్ సినిమాలు 'సైనికుడు', 'అతిథి', 'ఖలేజా' ఆడకపోవడానికి ప్రధాన కారణం వాటిలో ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడమేనని భావించిన శ్రీను వైట్ల, అతని రచయితలు గోపీమోహన్, కోన వెంకట్ 'దూకుడు'ని హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మలచడంలో విజయం సాధించారు. స్వతహాగా రచయిత కూడా అయిన శ్రీను వైట్ల ఇందులో అనేక పంచ్ డైలాగుల్ని స్వయంగా రాశాడు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ పాత్రలతో పాటు మహేశ్ సైతం కామెడీని పంచడంతో వినోదానికి కొదవ లేకుండా పోయింది. సినిమా ట్యాగ్‌లైన్ 'డేరింగ్ అండ్ డేషింగ్'కు తగ్గట్లు మహేశ్ కేరక్టర్ రూపొందింది. యాక్షన్ సీన్లలో అతని ఎనర్జీ మాస్ ఆడియెన్స్‌ని విపరీతంగా అలరిస్తోంది. ఆ పాత్రలో చెలరేగిన మహేశ్ సినిమానంతా తన భుజాల మీద మోశాడు. అతని డైలాగ్ డిక్షన్, మధ్య మధ్యలో హైదరాబాద్ హిందీలో, తెలంగాణ యాసలో మాట్లాడి బాగా ఆకట్టుకున్నాడు. ప్రకాశ్‌రాజ్, మహేశ్ మధ్య తండ్రీకొడుకుల అనుబంధం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఫలితంగా 2011లో తొలి సూపర్ డూపర్ హిట్‌కు మార్గం సుగమమైంది. 'దూకుడు' ఏ స్థాయి రికార్డుల్ని సాధిస్తుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఓపికపట్టాలి.

No comments: