Saturday, September 24, 2011

న్యూస్: సంచలనాలకి సిద్ధం 'సెవెన్త్ సెన్స్'!

సూర్య, మురుగదాస్ కాంబినేషన్‌లో మరో సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అసాధారణంగా! ఇప్పుడు ''సెవెన్త్ సెన్స్' విషయంలో అలాంటి అంచనాలే నెలకొన్నాయి. ఇదివరకు ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'గజిని' సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. మొదట తమిళంలో, తర్వాత తెలుగులో ఘన విజయం సాధించిన ఆ సినిమా ఆ తర్వాత అమీర్‌ఖాన్ హీరోగా హిందీలో రీమెక్ అయ్యి బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సూర్య, మురుగదాస్ కలిసి 'సెవెన్త్ సెన్స్'ని సృష్టించారు. తమిళంలో ఈ సినిమా పేరు '7ఆం అరివు'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య మూడు భిన్న గెటప్పుల్లో కనిపించనున్నాడు. తెలుగు వెర్షన్‌కి 'చూడని అవతారం' అనే ట్యాగ్‌లైన్‌ని ఉపయోగిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ అధినేత బి. సుబ్రమణ్యం అందిస్తున్నాడు. సూర్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ అంటే సుమారు 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణమవుతోంది.
"
ఎనిమిది నెలలు రిసెర్చ్ చేసి ఈ చిత్రకథ తయారుచేశాను. 'గజని' కంటే నాలుగైదు రెట్లు బాగుంటుంది. సినిమాలో ప్రారంభంలో వచ్చే పది నిముషాల కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం" అని మురుగదాస్ తెలిపాడు. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి స్క్రిప్ట్‌తో ఇంతవరకు సినిమా రాలేదనీ, 'గజిని' తర్వాత అంతకంటే బెటర్ స్క్రిప్ట్ కోసం మురుగదాస్ శ్రమించి 'సెవెన్త్ సెన్స్'ని తయారుచేశాడనీ సూర్య చెప్పాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం.. 'గజిని'కి మ్యూజిక్ అందించిన హారిస్ జయరాజ్ ఈ సినిమాకీ సంగీత బాణీలు సమకూర్చాడు. అటు తమిళ్, ఇటు తెలుగులో సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలని సంకల్పించారు.
జానీ ట్రి గుయేన్, అభినయ, అవినాశ్, గిన్నిస్ పక్రు, అశ్విన్ కాకుమాను, ధన్య బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా గొప్పగా వుంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా ఓపెనింగ్స్ దక్షిణాదిలో 'రోబో' ఓపెనింగ్స్‌ని మించి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఆ సినిమా బాక్సాఫీసు రికార్డుల్ని అధిగమించే అవకాశం ఈ సినిమాకి ఉటాయని చాలామంది నమ్ముతున్నారు.

No comments: