Friday, September 16, 2011

న్యూస్: హీరోయిన్లకు 'మా' నోటీసులు

ఇప్పటివరకు తమ సంఘంలో సభ్యత్వం తీసుకోని కొంతమంది హీరోయిన్లకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నోటీసులు జారీ చేసింది. ముంబైతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి చోట్ల నుంచి పలువురు తారలు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొంతమంది 'మా'లో సభ్యత్వం తీసుకోకుండానే నటిస్తూ వస్తున్నారు. వీరివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలు వారిపై 'మా'కు ఫిర్యాదు చేసినా, వారు తమ సభ్యులు కాకపోవడంతో 'మా' ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా వారు సభ్యత్వం తీసుకోకపోవడంతోనే సుమారు 14 మంది హీరోయిన్లకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వారిలో చాలాకాలం నుంచే తెలుగు సినిమాల్లో నటిస్తున్న త్రిష, జెనీలియా, తమన్నాతో పాటు ఇటీవలి కాలంలో క్రేజ్ పొందిన సమంత, నిత్యమీనన్, పార్వతీ మెల్టన్ వంటి తారలు ఉన్నారు. సెప్టెంబర్ 30లోగా వీరు సభ్యత్వం తీసుకోకపోతే అక్టోబర్ 1 నుంచి వారికి సహకరించకూడదని 'మా' నిర్ణయించింది.

No comments: