Monday, September 26, 2011

న్యూస్: ఆసక్తి రేపుతున్న మహేశ్, సుకుమార్ కాంబినేషన్



మహేశ్, శ్రీను వైట్ల తొలి కాంబినేషన్‌లో వచ్చిన 'దూకుడు' సినిమా రికార్డు కలెక్షన్ల వైపు దూసుకుపోతుండగా, మరో డైరెక్టర్‌తో మహేశ్ తొలి కాంబినేషన్ సినిమా విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. ఆ కాంబినేషన్ సుకుమార్‌తో. పూరి జగన్నాథ్‌తో చేస్తున్న 'బిజినెస్‌మేన్' తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో చేయడానికి మహేశ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో ఉన్న నిజాన్ని సుకుమార్ ధృవీకరించాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టుని అతను సిద్ధం చేశాడు. 'బిజినెస్‌మేన్' 2012 జనవరిలో విడుదల కాగానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని కూడా 'దూకుడు' నిర్మాతలే తీయనున్నారనేది సమాచారం. సుకుమార్‌కి అత్యంత ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి పనిచేసే అవకాశాలున్నాయి. సుకుమార్ విషయానికి వస్తే సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్న ఓ హీరోతో పనిచేయడం అతడికి ఇదే తొలిసారవుతుంది. ఇదివరకు అతను అల్లు అర్జున్, రాం, నాగచైతన్యలను డైరెక్ట్ చేశాడు. ఆ ముగ్గురిలో స్టార్ ఇమేజ్ ఉన్నది అర్జున్‌కే. 'ఆర్య'తో అతడికి ఆ ఇమేజ్ తెచ్చింది సుకుమార్ అనేది గమనార్హం. ఇప్పుడు మహేశ్‌ని అతడు డైరెక్ట్ చేసే సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అతడి స్క్రిప్టుల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మేధావితనం కూడా ఉంటుందనేది నిజం. అంటే ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే తీరులో అతడు హీరో పాత్రని మలుస్తుంటాడు. మరి మహేశ్‌ని అతడు ఎలా చూపిస్తాడు? మహేశ్‌లోని నటుణ్ణి ఎలా ఉపయోగించుకుంటాడు? అనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

No comments: