Wednesday, September 14, 2011

న్యూస్: 'మొగుడు' మీద ఆశలెన్నో!

కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'ఝుమ్మంది నాదం' రిలీజయినప్పుడు తాప్సీ రూపంలో టాలీవుడ్‌కి మరో ఇలియానా పరిచయమయ్యిందనే టాక్ వచ్చింది. 'దేవదాసు', 'పోకిరి' సినిమాలతో ఇలియానా హాటెస్ట్ హీరోయిన్ అయిన విధంగానే తాప్సీ కూడా అమిత క్రేజ్ సంపాదించుకుంటుందని అనుకున్నారు. చిత్రంగా నాలుగు సినిమాలు రిలీజైనా ఆమెకి తెలుగులో అనుకున్నంత క్రేజ్ రాలేదు. 'పోకిరి' తరహా హిట్ ఆమెకి రాకపోవడమే దీనికి కారణమని చెప్పాలి. అందచందాల విషయంలో ఏమాత్రం వంకపెట్టలేని రీతిలో ఉండే ఈ పంజాబీ ముద్దుగుమ్మ 'ఝుమ్మంది నాదం' తర్వాత 'వస్తాడు నా రాజు', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'వీర' సినిమాల్లో చేసింది. వీటిలో 'మిస్టర్ పర్ఫెక్ట్' ఒక్కటే హిట్టు. అందులోనూ ఆమె చేసింది సెకండ్ హీరోయిన్ కేరక్టరే. ఫలితంగా అనుకున్నంతగా ఆమె కెరీర్ ఊపందుకోలేదు. టాప్ హీరోల సరసన ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే సినిమా చేస్తోంది. ఆ సినిమా 'మొగుడు'. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆమె గోపీచంద్ సరసన నటిస్తోంది. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాపై తాప్సీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ మధ్య రొమాంటిక్ సీన్లు ఆడియెన్స్ మతులు పోగొడతాయని ఆ సినిమా యూనిట్ మెంబర్స్ అంటున్నారు. రొమాంటిక్ సీన్లు తీయడంలో కృష్ణవంశీది అందె వేసిన చెయ్యి కావడంతో తాప్సీ అందాలు ఈ సినిమాలో కనువిందు చేస్తాయని ఊహించవచ్చు. బాలీవుడ్‌లో 'చష్మే బద్దూర్' అనే సినిమాని సిద్ధార్థ్‌తో చేయబోతున్న తాప్సీకి 'మొగుడు' ఎలాంటి కానుకనిస్తాడో చూడాల్సిందే.

No comments: