Tuesday, September 20, 2011

న్యూస్: మరికొన్ని తెలంగాణా సినిమాలొస్తున్నాయ్!

కొద్ది రోజుల్లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో తీసిన మరో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆర్. నారాయణమూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన 'పోరు తెలంగాణ' సెప్టెంబర్ 16న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి టీఅర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కామెంట్ చేస్తూ "శంకర్ తీసిన 'జైబోలో తెలంగాణ' కంటే నారాయణమూర్తి తీసిన 'పోరు తెలంగాణ' వంద రెట్లు బాగుంది. అందులో ప్రేమా గీమా ఉంటే ఇందులో అలాంటివి లేవు. ఉన్నదంతా ఉద్యమమే" అన్నారు. ఇక సెప్టెంబర్ 17న వస్తుందనుకున్న 'జై తెలంగాణ' అనే సినిమా విడుదల కాలేదు. తెలంగాణకు చెందిన ప్రజా కళాకారుడు రసమయి బాలకిషన్ ఈ సినిమాని రూపొందించారు. ఇందులో నిజ జీవిత పాత్రని కూడా ఆయన పోషించారు.
ఇక ఇదివరకు 'అవును నిజమే', 'నిక్కీస్ ఎంగేజ్‌మెంట్' వంటి లవ్‌స్టోరీలు తీసిన రఫి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 'ఇంకెన్నాళ్లు' సినిమా రూపొందించాడు. "నాయకుల గురించే ఎప్పుడూ మాట్లాడుతూ, రాస్తుంటాం. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుని, మరుగున పడిపోయిన కుటుంబాన్ని తీసుకుని, మూడు తరాలుగా వారు చేసిన త్యాగాల్ని తెరకెక్కించిన చిత్రం 'ఇంకెన్నాళ్లు. తెలంగాణ ప్రజల పక్షాన ఈ చిత్రాన్ని తీశా. 60 మంది దాకా తెలంగాణ కళాకారుల్ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నా'' అని చెప్పాడు రఫి. ఈ మాటలు చెప్పేప్పుడు భావోద్వేగానికి గురైన రఫి ఏడ్చేశారు కూడా. యథాప్రకారం ఈ సినిమాకి కూడా రఫీయే సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ విశేషం సినీ జర్నలిస్ట్ మసాదె లక్ష్మీనారాయణ గేయ రచయితగా పరిచయమవుతుండటం. ఇందులో అతను రెండు పాటలు రాశాడు. లక్ష్మీనారాయణ ప్రస్తుతం జీ 24గంటలు చానల్లో సినిమా రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఈ నెలాఖరు లేదంటే అక్టోబర్ ప్రథమార్థంలో విడుదల కానున్నది. అలాగే శివాజీ ప్రధాన పాత్ర చేస్తున్న 'కొలిమి' అనే సినిమా నిర్మాణంలో ఉంది. వీటిలో ఏవి తెలంగాణా ప్రజల్ని ఆకట్టుకుంటాయో వేచి చూడాల్సిందే.

No comments: