Saturday, September 3, 2011

న్యూస్: మరో సీక్వెల్... డైరెక్టర్‌గా మరో కమెడియన్!

ఏవీఎస్ తర్వాత మరో హాస్యనటుడు డైరెక్టర్ అవతారం ఎత్తాడు. అయితే అతను మరీ జూనియర్. కానీ తన హాస్య నటనతో మంచి పేరే సంపాదించుకున్నాడు. అతను కిశోర్. దేవా కట్టా డైరెక్ట్ చేసిన 'వెన్నెల' సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసి, ఆ సినిమా పేరుతో 'వెన్నెల' కిశోర్‌గా పాపులర్ అయిన అతడు. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్‌తో డైరెక్టర్‌గా పరిచయమవుతుండటం విశేషం. తెలుగులో ప్రస్తుతం సీక్వెల్ సీజన్ నడుస్తోంది. 'గాయం 2', 'మనీ మనీ మోర్ మనీ' తర్వాత ఇప్పుడు 'వెన్నెల'కి సీక్వెల్ తయారవుతోంది. చిత్రమేమంటే ఈ సినిమాకి కిశోర్ 'వెన్నెల 2' అని గాక, 'వెన్నెల 1 1/2' (వెన్నెల వన్ అండ్ హాఫ్) అని పేరు పెట్టడం. 'లవ్ ప్లస్ లాఫ్ హోల్ క్యూబ్ మైనస్ లాజిక్' అనేది ట్యాగ్‌లైన్.
"నేను పరిచయమైన 'వెన్నెల'కి సీక్వెల్‌తో డైరెక్టర్ని కావడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులు ఊహించని ఎన్నో ఆశ్చర్యాలు ఇందులో ఉంటాయి. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీస్తున్నా. హైదరాబాద్‌తో పాటు అమెరికా, బ్యాంకాక్, స్విట్జర్లాండ్‌లలో షూటింగ్ జరుపుతాం. చిత్రసీమలోని పేరుపొందిన కమెడియన్లందరూ ఇందులో ఉన్నారు. హీరో హీరోయిన్ల పేర్లని తర్వాత తెలియజేస్తాం" అని చెప్పాడు కిశోర్. ఈ సినిమాని జీఆర్ 8 ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌పై వాసు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'గాయం 2', 'మనీ మానీ మోర్ మనీ' సినిమాలు ఫ్లాపైన నేపథ్యంలో ఈ కామెడీ సీక్వెల్ ఎలా ఆడుతుందో చూడాల్సిందే.

No comments: