Thursday, September 15, 2011

'చిల్లర దేవుళ్లు' చెబుతున్న నిజాలు-3

(సెప్టెంబర్ 10 తరువాయి)
"అయితే తమ తెలుగు కొంత కాలానికి ఉర్దూగా మారేట్లుంది. ఆంధ్రోద్యమం ఎలా ఉందండీ?"
"రాజ్యం తురుష్కులది. ఉర్దూను అభివృద్ధి పర్చడం వారి లక్ష్యం. అందుకే 3.10.1918న ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. ఇక్కడ నాల్గవ తరగతి వరకు మాత్రమే తెలుగు. ఏడవ తరగతి దాకా తెలుగు రెండవ భాషగా ఉంటుంది. ఆ తరువాత చదువంతా ఉర్దూలోనే. విద్యావంతుల సంఖ్య వేయింటికి 82. అందులోనూ తురకల్లో 59 మంది కాగా, హిందువుల్లో 23 మంది. ప్రజాహిత కార్యాల్లో అభిరుచి కలవారంతా మహారాష్ట్రులే.
"తెలుగువారిలో విద్యాధికుడు ఎక్కడైనా వెక్కిరించినట్లు కనిపించినా, హైదరాబాద్ తన నగరమనీ, తెలుగు తన మాతృభాషా అనీ సాధారణంగా భావించడు. అతని వేషభాషల్లో ఆంధ్రత్వం వెదకాల్సి ఉంటుందని చెపితే సరిపోతుంది. తెలుగువారికి తమ భాషను గుర్తుకు తేవాలనే ఉద్దేశ్యంతో 1.9.1901 నాడు రెసిడెన్సీ బజార్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించబడింది. అందుకు కారకులు నాయని వెంకటరంగారావు బహద్దుర్‌గారు, కొమర్రాజు లక్ష్మణరావుగారు, రావిచెట్టు రంగారావుగారు.
"11.11.1922న కార్వే పండితుని అధ్యక్షతన నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభ సమావేశమైంది. అధ్యక్షులు కొంత ఇంగ్లీషులోనూ, కొంత మహారాష్ట్రలోనూ మాట్లాడితే తెలుగువాళ్లమైన మాకు మనస్తాపం కలిగింది. శ్రీ అల్లంపెల్లి వెంకట్రామారావుగారు ఒక ఉపన్యాసం తెలుగులో ఇవ్వపోగా, సభాసదులు, ముఖ్యంగా మహారాష్ట్రులు - చప్పట్లు చరిచి ఉపన్యాసకుడు ప్రసంగం ఆపుచేసి కూర్చొనేట్లు చేశారు. తెలుగువాళ్లు సభ ముగియకముందే వెళ్లిపోయారు. తెల్లవారి ట్రూపు బజారులో టేకుమాల రంగారావుగారి ఇంట్లో పదకొండుగురం ఆంధ్రులం సమావేశమై నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘం స్థాపించాం. నిజాం రాష్ట్రంలోని తెలుగువారిలో పరస్పర సహానుభూతి కలిగించి, వారి అభివృద్ధికోసం ప్రయత్నించడం, సంఘాలను స్థాపించడం దాని ముఖ్య ఉద్దేశ్యాలు."
"అయితే రాజకీయ లక్ష్యాలేం లేవన్నమాట."
"నిజాం రాష్ట్రపు రాజకీయాలు విచిత్రమైనవి. ఇక్కడ పోలీసులు రాక్షసుల్ని తలతన్నినవారు. 1919లో ఒక ఫర్మానా ద్వారా నిజాం నవాబు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలును విస్తరింపజేస్తే అందుకు కృతజ్ఞత తెలియజేయడానికి జరిగిన సభలే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సభలు. భారతదేశంలో వ్యాపించిన ఖిలాఫత్ ఉద్యమం హైదరాబాదుకు కూడా వ్యాపించి 20, 25 వేల మందితో బహిరంగసభలు జరగడం ఇక్కడ మామూలైపోయింది. హిందూ ముస్లిముల ఐక్యం బలపడ్డం చూసి ప్రభుత్వానికి కన్నుకుట్టింది. హిందువులతో కలిశారనే నేరానికి కొందరు ముస్లిం యువకుల్ని అరెస్టు చేసి మన్ననూరు పంపడం జరిగింది."
(ఇంకావుంది)

No comments: