Thursday, July 28, 2011

న్యూస్: 'నిప్పు'తో వైవీఎస్ చౌదరి చెలగాటం

'సొగసు చూడతరమా', 'రామాయణం', 'చూడాలని వుంది', 'మనోహరం', 'ఒక్కడు'... ఇవన్నీ ఒకే దర్శకుడు రూపొందించిన సినిమాలు. 'మృగరాజు', 'సైనికుడు', 'వరుడు'... ఇవి కూడా అదే దర్శకుడు తీసిన సినిమాలు. అతను గుణశేఖర్. తన కెరీర్‌లో అబ్బురమనిపించే చిత్రాలతో పాటు 'ఇంత ఘోరంగా తీశాడేంటి?' అనిపించే చిత్రాలూ తీసిన గుణశేఖర్‌పై ప్రధానంగా ఒక విమర్శ ఉంది. అది ఔట్‌డోర్‌లో తీయాల్సిన సన్నివేశాల్ని కూడా భారీ సెట్స్ వేసి తీస్తాడనీ, తద్వారా బడ్జెట్‌ని విపరీతంగా పెంచేస్తాడనీ. అందుకే 'బడ్జెట్ పెంచాలంటే గుణశేఖర్‌లా సెట్స్ వేస్తే సరి' అనే నానుడి టాలీవుడ్‌లో ఏర్పడింది. 'ఒక్కడు'లోని చార్మినార్ సెట్, 'అర్జున్'లోని మధుర మీనాక్షి దేవాలయ సెట్, 'సైనికుడు'లోని సముద్రం సెట్ వంటివి అందుకు ఉదాహరణలు. మునుపటి డిజాస్టర్ మూవీ 'వరుడు'లోనూ పెళ్లి మండపం సెట్‌ని అతి లావిష్‌గా ఏర్పాటు చేయించాడు. ఇలా నిర్మాతల పాలిట విలన్‌లాగా తయారైన ఆయన్ని తన 'ఇదీ నా కథ'లో ప్రఖ్యాత కవి, నిర్మాత మల్లెమాల సుందరరామిరెడ్డి (ఎమ్మెస్ రెడ్డి) తూర్పారబట్టిన సంగతి ఇటీవలే మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
ప్రస్తుతానికి వస్తే అలాంటి గుణశేఖర్ డైరెక్షన్‌లో మరో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి 'నిప్పు' అనే సినిమాని నిర్మిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇందులో రవితేజ హీరో. దీక్షా సేథ్ హీరోయిన్. 'దేవదాసు' తర్వాత డైరెక్టర్‌గా మరో హిట్‌లేని చౌదరి ఇప్పుడు గుణశేఖర్‌తో ఎందుకు సినిమా నిర్మిస్తున్నాడో అర్థంకాక సినీ వర్గాల వారు తలబద్దలు కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం తిరిగే రోజుల్లో మద్రాసులో ఒకే చోట ఉన్నామనీ, ఆ స్నేహంతో ఈ సినిమా చేస్తున్నాననీ చౌదరి చెబుతున్నాడు. కానీ గుణశేఖర్ గురించి తెలిసి తెలిసీ ఎందుకు 'నిప్పుతో చెలగాటమాడుతున్నాడు? ఇది తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు.

No comments: