Sunday, July 31, 2011

న్యూస్: తండ్రీకొడుకులుగా కృష్ణంరాజు, ప్రభాస్ రాణిస్తారా?

కృష్ణంరాజు, ప్రభాస్ తొలిసారి తండ్రీకొడుకులుగా వెండితెర మీద ఆవిష్కృతం కాబోతున్నారు. అవును. ప్రభాస్ హీరోగా చిత్రరంగంలో అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల తర్వాత ఆ ఇద్దరూ తండ్రీ కొడుకుల పాత్రల్ని అభినయించ బోతున్నారు. ఆ సినిమా 'రెబెల్'. దాన్ని రూపొందిస్తోంది రాఘవ లారెన్స్. శ్రీ బాలాజీ సినీ మీడియా బేనర్‌పై జె. భగవాన్, జె. పుల్లారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. ఆ ఇద్దరూ 'బిల్లా'లో మొదటిసారి కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో వారికి ఎలాంటి బంధుత్వమూ లేదు. ప్రభాస్ టైటిల్ రోల్ చేస్తే, కృష్ణంరాజు పోలీసాఫీసర్ పాత్రని చేశారు. 'బిల్లా' ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఈ పెదనాన్న, కుమారుల్ని తండ్రీ కొడుకులుగా చూపించే ఛాన్స్‌ని దక్కించుకున్నాడు లారెన్స్. అతను చెప్పిన కథ, పాత్రలు ఆ ఇద్దరికీ బాగా నచ్చినందునే ఆ పాత్రల్ని చేయడానికి వారు అంగీకరించారు. ఇప్పటివరకు ఆ తరహా పాత్రలు వచ్చినా స్క్రిప్టులు నచ్చనందునే వారు చేయలేదు. తెరమీద తండ్రీకొడుకులుగా చేసే సినిమా ప్రతిష్ఠాత్మకంగా ఉండాలనీ, తప్పనిసరిగా హిట్టవ్వాలనీ ఆశించడం వల్లే, సరైన సబ్జెక్ట్ కోసం వారు ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పటికి వారు ఆశించిన సబ్జెక్ట్ దొరికింది. మాస్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో తండ్రి సెంటిమెంట్ ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన ఇద్దరు నాయికలు - అనుష్క, దీక్షాసేథ్ నటిస్తున్నారు. నాగార్జునతో చేసిన 'డాన్' తర్వాత లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మరి కృష్ణంరాజు, ప్రభాస్‌ని ప్రేక్షకులు ఏ రీతిలో ఆదరిస్తారన్నది ఆసక్తికరం.

No comments: