Friday, July 29, 2011

న్యూస్: కమలాకర్ 'సంచలనం' సృష్టిసాడా?

మాజీ ఎమ్మెల్యే (దర్శి) బూచేపల్లి సుబ్బారెడ్డి కుమారుడైన కమలాకర్‌రెడ్డి సినిమా రంగంలో ఎలాగైనా తన ముద్ర వేయాలనే పట్టుదలతో అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. ఏడేళ్ల క్రితమే 'అభి' అనే సినిమాతో హీరోగా తెరగేంట్రం చేసిన అతను ప్రేక్షకాదరణ పొందలేక పోయాడు. నిజానికి 'అభి' బాక్సాఫీసుని గెలవక పోయినా మ్యూజికల్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కారణం దానికి బాణీలు కూర్చింది దేవిశ్రీ ప్రసాద్!. అందులోని 'వంగతోట మలుపుకాడ..' పాట ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. దాని తర్వాత కమలాకర్ 'సన్నీ', 'హాసిని' వంటి సినిమాలు చేశాడు. 'హాసిని'లో 'ప్రేమిస్తే' సంధ్య హీరోయిన్. అది కూడా బాక్సాఫీసుని గెలవలేకపోయింది. అయినా కానా ఈ సినిమా డైరెక్టర్ బి.వి. రమణారెడ్డి మీద పూర్తి నమ్మకం ఉంచిన కమలాకర్ ఇప్పుడు అతని డైరెక్షన్‌లోనే 'సంచలనం' చిత్రాన్ని నిర్మించాడు. కమలాకర్, సాయికుమార్, ఆశిశ్ విద్యార్థి ప్రధాన పాత్రధారులు. రెగ్యులర్ సాంగ్ అండ్ ఫైట్, రొమాన్స్‌లకు భిన్నంగా కాన్సెప్ట్ ఓరిఎంటెడ్ సినిమాగా దీన్ని రమణారెడ్డి రూపొందించాడు. ఓ అమాయక యువకుణ్ణి కొంతమంది ఎందుకు టార్గెట్ చేశారు, తనకెదురైన ప్రమాదం నుంచి అతను ఎలా తప్పించుకునాడనేది ఇందులోని ప్రధానాంశం. "ఇది యధార్థ సంఘటన ప్రేరణతో అల్లిన కల్పిత కథతో తయారైన సినిమా. ఎవర్నీ ఉద్దేసించి ఈ సినిమా తీయలేదు. ఎవరినైనా ఉద్దేశించినట్లు అనిపిస్తే అది కేవలం కాకతాళీయమే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదని గ్రహించాల్సిందిగా కోరుతున్నా" అని కమలాకర్ చెప్పడాన్ని బట్టి ఇందులో పోలీస్ వ్యవస్థ మీదా, రాజకీయ వ్యవస్థ మీదా వివాదాస్పద అంశాలు ఇమిడి ఉన్నాయని అర్థమవుతోంది. అయితే 'సంచలనం' టైటిల్‌కి తగ్గట్లు బాక్సాఫీసు వద్ద అది చేసే సందడి పైనే అది సృష్టించే వివాద తీవ్రత కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రేక్షకాదరణ పొందలేక పోయిన కమలాకర్ నిజంగా 'సంచలనం' సృష్టిస్తాడా? ఈ రోజే ఈ సినిమా విడుదలైంది. ఇనిషియల్ టాక్ బావుంది. అది కలెక్షన్ల రూపంలో మారడమే కావలసింది.

No comments: