Thursday, July 14, 2011

న్యూస్: మంచి రచయితని మిస్సవుతున్న టాలీవుడ్

డైరెక్టర్‌గా పోసాని కృష్ణమురళికి ఊహించని ఓటమి 'దుశ్శాసన'. శ్రీకాంత్‌తో ఇదివరకు తీసిన 'ఆపరేషన్ దుర్యోధన' పెట్టుబడిపై మంచి ఆదాయం తీసుకొచ్చి నిజమైన హిట్టవడంతో 'దుశ్శాసన' కూడా అలాగే పెద్ద విజయం సాధిస్తుందని అతను ఆశించాడు. కానీ ఆ సినిమా విడుదల చేయడమే నిర్మాతకి తలకి మించిన భారమైంది. హీరో శ్రీకాంత్ రూ. 20 లక్షలిచ్చి ఆదుకోబట్టి సరిపోయింది. రాజకీయ, పోలీసు వ్యవస్థల మీదా, సమాజం మీదా తనకున్న అక్కసునీ, కోపాన్నీ సినిమాల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నించే పోసాని రచయితగా ఎంతగా సక్సెస్ అయ్యాడో, దర్శకుడిగా మారినప్పట్నించీ అంతగా విమర్శల్నీ, వివాదాల్నీ మూటగట్టుకుంటూ వచ్చాడు. తను హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన 'మెంటల్ కృష్ణ' ఆయన మానసిక పరిస్థితికి అద్దం పట్టింది. ఆ సినిమాకి కొద్దో గొప్పో డబ్బులు రావచ్చు గాక, కానీ ఆ తర్వాత నుంచీ ఆయన నటించిన సినిమాల్ని కానీ, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్ని కానీ జనం పట్టించుకోవడం మానేశారు. రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీపరుడని కీర్తిస్తూ చిరంజీవి పార్టీలో చేరిన ఆయన గత ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీకి పోటీచేసి ఘోరంగా ఓడిపోయాడు. ఇప్పుడు అదే చిరంజీవిని పెద్ద అవినీతిపరుడని విమర్శిస్తూ ఉన్నవాళ్లలో జగన్మోహనరెడ్డి బెటరంటూ వైయెస్సార్ కాంగ్రెస్స్ పార్టీలో చేరిపోయాడు. ఇలా స్థిరమైన అభిప్రాయమంటూ లేని ఆయన మునుముందు ఏం చేసినా జనం వినే స్థితి కానీ, చూసే స్థితి కానీ కనిపించడంలేదు. మొత్తానికి సినీ పరిశ్రమ ఓ మంచి రచయిత సేవల్ని మిస్సవుతోందని చెప్పవచ్చు.

No comments: