Saturday, July 9, 2011

న్యూస్: 'నిప్పు'పై సినీ వర్గాల ఆసక్తి

'మిరపకాయ్' హిట్ తర్వాత రాంగోపాల్‌వర్మ డైరెక్షన్‌లో చేసిన 'దొంగల ముఠా' వచ్చిందో, లేదో కూడా జనానికి తెలీనివిధంగా ఫ్లాప్ కావడం, రమేశ్ వర్మ దర్శకత్వంలో చేసిన 'వీర' బి, సి సెంటర్లలో మాత్రమే గట్టెక్కడంతో రవితేజ 'నిప్పు' మీద ఎక్కువ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఇది రవితేజ, గుణశేఖర్ తొలి కాంబినేషన్ ఫిల్మ్. బొమ్మరిల్లు పతాకంపై వై.వి.ఎస్. చౌదరి నిర్మిస్తున్న చిత్రం. అంతే కాదు, మద్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కాలంలో ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు స్నేహితులు (రవితేజ, గుణశేఖర్, వైవీఎస్) కలిసి చేస్తున్న చిత్రం. ఇలాంటి స్పెషాలిటీస్ ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ పొడుగు కాళ్ల సుందరి దీక్షాసేథ్ కాగా, యువన్‌శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్నాడు. 2012 జనవరిలో అంటే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనేది వైవీఎస్ సంకల్పం. 'ఒక్కడు' తర్వాత గుణశేఖర్ చేసిన సినిమాలేవీ హిట్టు కాకపోయినా 'నిప్పు'పై సినీ వర్గాలు ఆసక్తిని చూపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకి మొదట 'కత్తి' అనే పేరు అనుకోవడం, కల్యాణ్‌రాం 'కల్యాణ్‌రాం కత్తి' అనే పేరుతో సినిమా తీయడంతో 'నిప్పు'గా టైటిల్ మారడం తెలిసిందే. కాగా దీంతో పాటు వంశీ డైరెక్షన్‌లో 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' అనే మరో ఆసక్తి కరమైన సినిమాని రవితేజ చేయబోతున్నాడు. దానికి సంబంధించిన వివరాల కోసం ఎదురుచూడండి.

No comments: