Saturday, July 9, 2011

న్యూస్: ఉదయ్ కిరణ్‌కి నిర్మాత దొరికాడు!

రెండో ఇన్నింగ్స్‌తో ఎలాగైనా మునుపటి ప్రాభవాన్ని పొందాలని తపిస్తున్న యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఇప్పుడు 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' అంటున్నాడు, టీనేజ్ గర్ల్ శ్వేతాబసు ప్రసాద్‌తో. తమిళుడైన సుభా సెల్వం ఈ సినిమాకి డైరెక్టర్. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి వరుస హిట్లతో యువతరం ఆరాధ్య నటుడిగా అవతరించిన ఉదయ్‌కి వాటి తర్వాత ఇప్పటివరకు మరో చెప్పుకోదగ్గ విజయమేదీ దక్కలేదు. ఐదేళ్ల క్రితం తన తొలి, మలి చిత్రాల దర్శకుడు తేజతో చేసిన 'ఔనన్నా కాదన్నా' సినిమా తర్వాత రెండేళ్ల విరామం తీసుకుని 'వియ్యాలవారి కయ్యాలు'తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినా అతడికి నిరాశే ఎదురయ్యింది. ఆ తర్వాత మదన్ దర్శకత్వంలో వచ్చిన 'గుండె ఝల్లుమంది'పై అతడెన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఉందనిపించుకున్నా, కమర్షియల్‌గా ఉపయోగపడలేదు. రెండేళ్ల క్రితం వచ్చిన 'ఏక్‌లవ్యుడు' బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ పరిస్థితుల్లో 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' సినిమాని ఓ తపనతో, ఓ కసితో చేశాడు ఉదయ్. అయితే పూర్తయి చాలా రోజులైనా ఇంతవరకు ఈ సినిమా ప్రేక్షకుల మధ్యకు రాలేకపోయింది. ఉదయ్ సినిమా అంటే బిజినెస్ వర్గాలు ఏమాత్రం ఆసక్తి చూపక పోతుండటమే దీనికి కారణం.
ఇలాంటి పరిస్థితుల్లోనే అతడి మరో సినిమా 'దిల్ కబడ్డి' షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. సముద్ర వద్ద పనిచేసిన శ్రీ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఇంతకీ ఈ సినిమా నిర్మాత ఎవరు? అతని పేరు శివకుమార్. ఉదయ్ కిరణ్‌కి స్నేహితుడు. బయటి నిర్మాతలు తనతో సినిమాలు తీయడానికి భయపడుతున్నందున స్నేహితులు, శ్రేయోభిలాషుల్నే ఉదయ్ సినిమాల్లోకి దింపుతున్నట్టున్నాడని సినీ వర్గాలు జోక్ చేస్తున్నాయి. పైగా ఇకనుంచీ తనకి గ్యాప్ రాదనీ, వరసగా సినిమాలు చేస్తాననీ అతను వాక్రుచ్చాడు కూడా.

No comments: