Monday, July 18, 2011

న్యూస్: తెలుగు సినిమాలకు థియేటర్లు కావలెను!

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ డబ్బింగ్ సినిమాల హవా నడుస్తున్నదనే దానికి ఇంకో మంచి ఉదాహరణ ఈ శుక్రవారం (జూలై 15) విడుదలైన మూడు డబ్బింగ్ సినిమాలు. వాటిలో రెండు తమిళం నుంచి తెలుగుకు వచ్చిన 'నాన్న', 'కాంచన' కాగా, మరోటి హాలీవుడ్ నుంచి తెలుగులోకి వచ్చిన 'హారీపోట్టర్ 7' (పార్ట్ 2). వీటి మధ్య 16న రెండు తెలుగు సినిమాలు 'మాయగాడు', 'కీ' విడుదలయ్యాయి. డబ్బింగ్ సినిమాలు మూడు కలిసి హైదరాబాద్ ఏరియాలో 65 థియేటర్లకు పైగా విడుదలైతే, రెండు తెలుగు సినిమాలు కలిసి కేవలం 14 థియేటర్లలో రిలీజయ్యాయి. విక్రం, అనుష్క జంటగా నటించిన డబ్బింగ్ సినిమా 'నాన్న' సిటీ ఏరియాలో 25 థియేటర్లలో, రాఘవ లారెన్స్ సినిమా 'కాంచన' 33 థియేటర్లలో, 'హారీపోట్టర్ 7' 7 థియేటర్లలో విడుదలయ్యాయి. మన తెలుగు సినిమాల్లో వేణు, ఛార్మి సినిమా 'మాయగాడు' 10 థియేటర్లలో విడుదలైతే, జగపతిబాబు హీరోగా నటించిన 'కీ' కేవలం అత్యల్పంగా 4 థియేటర్లలోనే రిలీజవడం గమనార్హం. అంటే తెలుగు సినిమాల కంటే పర భాషల నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమాలకే ఎక్కువ బిజినెస్ జరుగుతున్నదన్న మాట. ఈ నేపథ్యంలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు డబ్బింగ్ సినిమాల కారణంగా థియేటర్లే దొరకని స్థితి నెలకొంది. ఇప్పటికే తమిళం నుంచి మరో రెండు డబ్బింగ్ సినిమాలు 'రంగం', 'వాడు వీడు' హైదరాబాద్ థియేటర్లలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆరోవారంలో ఉన్న అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమా కేవలం 5 థియేటర్లలోనే సిటీలో నడుస్తుండగా, ఆర్.బి. చౌదరి కుమారుడు జీవా నటించిన 'రంగం' డబ్బింగ్ సినిమా పదో వారంలో 11 థియేటర్లలో ఆడుతుండటం విశేషం. దీన్ని బట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు డబ్బింగ్ సినిమాల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దబ్బింగ్ సినిమాలకు 50% టాక్స్ విధించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.

No comments: