Wednesday, July 27, 2011

న్యూస్: తండ్రి లాగే రామునిగా బాలయ్య అలరిస్తాడా?

వరుసగా ఏడు ఫ్లాపుల తర్వాత వచ్చిన సూపర్ హిట్ మూవీ 'సింహా'తో జూలు విదిల్చాడు నందమూరి బాలకృష్ణ. తన పని అయిపోయిందని జరుగుతున్న ప్రచారానికి ఆ సినిమాతో జవాబిచ్చాడు. అయితే ఆ వెంటనే వెటరన్ డైరెక్టర్ దాసరి నారాయణరావు 150వ సినిమా 'పరమవీరచక్ర' చేసి పొరబాటు చేశాడు. ప్రేక్షకులు ఆ సినిమాని నిర్ద్వంద్వంగా తిరస్కరించినా ఇప్పటికీ అది తన దృష్టిలో గొప్ప సినిమానే అని గొప్పలు చెబుతూనే ఉన్నారు దాసరి. దాని సంగతి పక్కన పెడితే ఇప్పుడు బాలకృష్ణ మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో బాపు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం' ప్రధానమైంది. ఎన్టీఆర్ ఒకప్పటి చిత్రరాజం 'లవకుశ' ఆధారంగా కొద్దిపాటి మార్పులు చేర్పులతో ఈ సినిమా తీస్తున్నారు. దివంగత ముళ్లపూడి వెంకటరమణ సంభాషణలు రాసిన ఈ చిత్రంలో రామునిగా బాలకృష్ణ నటిస్తుంటే, ఆయన సరసన సీతగా అందాల తార నయనతార నటించడం విశేషం. సూపర్‌హిట్ మూవీ 'సింహా' తర్వాత వారు కలిసి పనిచేసిన సినిమా కావడంతో ఈ జోడీ తప్పకుండా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. తన చివరి కాల్షీట్ రోజు నయనతార ఈ సినిమా సెట్స్ మీద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇందులో వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్ నటిస్తుండటంతో సినిమాకి స్టార్ వాల్యూ కూడా ఏర్పడింది. ఇది కాక పరుచూరి మురళి డైరెక్షన్‌లో తయారవుతున్న సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు బాలకృష్ణ. ఇటీవలే సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ నిర్దేశకత్వంలో 'హర హర మహదేవ' సినిమా మొదలైంది. ఈ సినిమాలతో, ముఖ్యంగా 'శ్రీరామరాజ్యం'తో బాలయ్య తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తాడని ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరుతాయా?

No comments: