Sunday, July 17, 2011

న్యూస్: మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకుంటున్న తేజ

సంచలన దర్శకుడు తేజ మూడేళ్ల సుదీర్ఘ విరామంతో మళ్లీ దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నాడు. చివరి సారిగా అతను డైరెక్ట్ చేసిన 'కేక' 2008 అక్టోబర్‌లో వచ్చింది. ఈ సినిమాతో ప్రసిద్ధ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు రాజా పరిచయమయ్యాడు. ఈ సినిమా ఎప్పుడొచ్చిపోయిందో జనానికి తెలీదు. అందుకే అతను మళ్లీ తెర మీద కనిపించలేదు. ఇక తేజ అయితే ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి మూడేళ్లు టైం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనతో సినిమా నిర్మించడానికి ముందుకొచ్చింది భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనందప్రసాద్. 'అమరావతి', 'వాంటెడ్' వంటి ఫ్లాపుల తర్వాత ఆయన తీయబోతున్న సినిమా ఇది. తేజ, ఆనందప్రసాద్ కాంబినేషన్ కుదిర్చింది అన్నే రవి. ఇదివరలో సినీ జర్నలిస్టుగా పనిచేసిన రవి ఇప్పుడు భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. తేజకు బాగా సన్నిహితుడు. అందుకే ఈ కాంబినేషన్ వీలుపడింది. తేజ డైరెక్ట్ చేయబోతున్న ఈ కొత్త సినిమాలో నలుగురు స్టార్ కమెడియన్లు మినహా మిగతా వాళ్లంతా కొత్తవాళ్లే నటించనున్నారు. దీని కోసం స్టార్ హంట్‌ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తన సినిమాలతో అనేకమందిని చిత్రసీమకు పరిచయం చేసిన తేజ ఈ సినిమాతో మరి కొంతమందిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఉదయ్ కిరణ్, రీమాసేన్, నితిన్, సదా, నవదీప్, సుమన్‌శెట్టి నుంచి ఎంతో మంది ఆయన ద్వారా టాలీవుడ్‌లో అడుగు పెట్టినవాళ్లే. ఈ కొత్త సినిమాతో పరిచయమైన వాళ్లలో ఎవరు లైంలైట్‌లోకి వస్తారో చూడాలి.

No comments: