Saturday, July 2, 2011

న్యూస్: తెలుగు తెరపై మరో యమధర్మరాజు

తెలుగు తెరమీద మరో యమధర్మరాజు కనిపించబోతున్నాడు. ప్రేక్షకుల మనసుల్లో యమధర్మరాజు అనగానే మొదట మెదిలే వ్యక్తి కైకాల సత్యనారాయణ. 'యమగోల' సినిమా నుంచి ఆ పాత్రని సత్యనారాయాణే చేయాలనే అభిప్రాయం బలపడింది. అదివరకు 'సతీ సావిత్రి'లో యమునిగా ఎన్‌టీ రామారావు విశ్వరూపాన్ని మనం చూశాం. అయినా ఆయన ఎక్కువ సినిమాల్లో ఆ పాత్రపోషణ చేయలేదు. అందువల్ల సత్యనారాయణకు తెలుగుతెర యమునిగా కీర్తి దక్కింది. అయితే ఆయనకు వయసు మళ్లినందున ఇతరులకు ఆ పాత్ర చేసే అవకాశాలు కలుగుతున్నాయనుకోవాలి. 'యమదొంగ'లో మోహన్‌బాబుకు ఆ పాత్ర చేసే అవకాశం కల్పించాడు డైరెక్టర్ రాజమౌళి. అందుకు తగ్గట్లుగానే తన విలక్షణ నటనతో, డైలాగ్ డెలివరీతో యముని పాత్రను బాగా అభినయంచి చూపారు మోహన్‌బాబు.
ఆ తర్వాత 'యమగోల.. మళ్లీ మొదలైంది' సినిమాలో సీనియర్ యమునిగా సత్యనారాయణ నటిస్తే, కుర్ర యమునిగా శ్రీకాంత్ పర్వాలేదనిపించుకున్నాడు. ఈ మధ్యే 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' సినిమాలో యముని పాత్రని వెటరన్ యాక్టర్ జయప్రకాశ్‌రెడ్డి తనదైన శైలిలో రక్తి కట్టించాడు.
ఇక ఇప్పుడు ఆ పాత్రని పోషించే అవకాశం శ్రీహరికి వచ్చింది. ఓవైపు హీరోగా, మరోవైపు కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ఆయన సాయిరాం శంకర్ హీరోగా నటించే ఓ సినిమాలో యమధర్మరాజు పాత్రని చేయబోతున్నాడు. ఇదివరకు 'వేడుక' అనే సినిమాని డైరెక్ట్ చేసిన జితేందర్ ఈ సినిమాకి దర్శకుడు. ముమైత్‌ఖాన్‌తో 'పున్నమినాగు'ని నిర్మించిన జి. విజయకుమార్ గౌడ్ ఈ సినిమాకి నిర్మాత. అమెరికా నేపథ్యంలో కథ నడవడం ఈ సోషియో ఫాంటసీ ప్రత్యేకత. అంటే ఇప్పటివరకు మన తెలుగు నగరాల్లో, గ్రామాల్లో మాత్రమే హల్‌చల్ సృష్టించిన యమధర్మరాజు ఈ సినిమాలో అమెరికాలో ఆ పని చేయబోతున్నాడు. ఇంకో సంగతేమంటే చాలా గ్యాప్ తర్వాత ఎన్నారై బ్యూటీ పార్వతీ మెల్టన్ ఇందులో నాయికగా సాయిరాం సరసన నటించబోతోంది. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలు కాబోతోంది. ఇందులో యమునిగా శ్రీహరి ఏవిధంగా రాణిస్తాడో చూడాల్సిందే.

No comments: