Tuesday, July 19, 2011

న్యూస్: బాలీవుడ్‌లో కాజల్ జిగేల్‌మంటుందా?

తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న ముంబై భామ కాజల్ అగర్వాల్ తన మాతృభూమిలో అలాంటి మ్యాజిక్‌ని చూపిస్తుందా? ఇప్పుడందరూ ఈ విషయంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆమె నాయికగా నటించిన తొలి బాలీవుడ్ ఫిల్మ్ 'సింఘం' జూలై 22న విడుదలవుతుండటమే దీనికి కారణం. ఇందులో ఆమె అజయ్ దేవగణ్ సరసన కనిపించబోతోంది. సూర్య, అనుష్క జంటగా నటించిన తమిళ హిట్ మూవీ 'సింగం' (తెలుగులో 'యముడు')కి ఇది రీమేక్. ఇందులో ఎస్సై బాజీరావ్ సింఘంగా అజయ్ నటిస్తే, అతని ప్రేయసి కావ్యగా కాజల్ నటించింది. మొదట ఈ పాత్రకి అసిన్‌నీ, తర్వాత ఒరిజినల్‌లో చేసిన అనుష్కనీ తీసుకోవాలని దర్శకుడు రోహిత్‌శెట్టి అనుకున్నాడు. అయితే అనుష్క బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపక పోవడంతో అనుకోకుండా ఆ ఛాన్స్ కాజల్ దక్కించుకుంది. వచ్చిన అవకాశాన్ని ఆమె చక్కగా ఉపయోగించుకున్నదనేది సమాచారం. నిజానికి ఈమెకి బాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా కాదు. అసలామె తెరంగేట్రమే బాలీవుడ్‌లో జరిగింది. 2004లో వచ్చిన 'క్యూన్.. హో గయా నా' సినిమాలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ఫ్రెండ్ పాత్రని తొలిగా చేసింది. ఆ సినిమా ఫ్లాపవడంతో ఎవరి దృష్టినీ ఆకర్షించలేక పోయింది కాజల్. దాంతో దక్షిణాదికి వచ్చిన ఆమె తన అందచందాలు, అభినయంతో టాలీవుడ్‌లో టాప్ రేంజికి ఎదిగింది. ఇన్నాళ్లకి హీరోయిన్‌గా తన భాషా చిత్రసీమలో ఆమెకి తొలి అవకాశం వచ్చింది. ఈ సినిమాతో తెలుగులో మాదిరిగానే అక్కడ కూడా ఆమె జిగేల్‌మంటుందో, లేదో...

No comments: