Saturday, July 16, 2011

న్యూస్: 'బెజవాడ రౌడీలు' సంచలనం సృష్టిస్తారా?

రవితేజ, ఛార్మి, సునీల్ కాంబినేషన్‌లో తీసిన 'దొంగల ముఠా' తర్వాత రాంగోపాల్‌వర్మ తెలుగులో 'బెజవాడ రౌడీలు' సినిమాని తీస్తున్నాడు. అయితే ఈ సినిమాకి ఆయన కేవలం నిర్మాతే. దర్శకుడు వివేక్‌కృష్ణ. అతనికిదే తొలి సినిమా. 20 యేళ్ల క్రితం బెజవాడలో ఉండే వాతావరణం నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, అతని సరసన ప్రతీక రావు నటిస్తోంది. ఆమె ఎవరో కాదు, 'అతిథి' ఫేం అమృతారావు చెల్లెలు. వాతావరణం 20 యేళ్ల క్రితంది అయినా అప్పటి వ్యక్తుల గురించి కానీ, అప్పటి సంఘటనల గురించి కానీ లేకుండా, పక్కా యాక్షన్ కమర్షియల్ సినిమాగా దీన్ని తీస్తున్నామని వర్మతో పాటు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కిరణ్‌కుమార్ కోనేరు చెబుతున్నారు. అయితే ఇది ఒకప్పుడు విజయవాడని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు గ్యాంగ్ వార్ నడిపిన వంగవీటి, దేవినేని కుటుంబాలే ఈ సినిమా కథకి ప్రేరణ అని ఇప్పటికే జనానికి తెలిసిపోయింది. వంగవీటి రంగాని పోలిన పాత్రని నాగచైతన్య పోషిస్తుండగా, దేవినేని రమణ అలియాస్ గాంధీ పాత్రని అభిమన్యుసింగ్ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ మీద వివాదం చెలరేగి రెండు నెల్ల క్రితం విజయవాడలో షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు పోలీసుల సహకారంతో అక్కడే షూటింగ్ నిర్వహిస్తున్నారు నిర్మాతలు. దీపావళికి ఈ సినిమాని విడుదల చేయాలనేది వారి ఆలోచన. 'రక్త చరిత్ర' తరహాలో ఉసూరుమనకుండా 'బెజవాడ రౌడీలు' సంచలనం సృష్టిస్తుందని ఆ సినిమా యూనిట్ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి.

No comments: