Saturday, July 16, 2011

న్యూస్: ఇలియానా అంతేనా?

జూనియర్ సిమ్రాన్‌గా పేరు తెచ్చుకుని అచిర కాలంలోనే టాప్ రేంజికి ఎదిగి, టాలీవుడ్‌లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి తారగా కాంతులీనిన గోవా సుందరి ఇలియానాకు ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం వింతే! ముఖారవిందం కంటే అందమైన నడుముతోటే యువతరాన్ని పడగొట్టేసిన ఆమె తొలి రెండు సినిమాలు 'దేవదాసు', 'పోకిరి' ఒకదాన్ని మించి మరోటి హిట్టవడంతో రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్ అయిపోయింది. బెల్లంకొండ సురేశ్ నిర్మించిన 'భలే దొంగలు' సినిమాతో కోటి రూపాయలు తీసుకున్న తొలి టాలీవుడ్ హీరోయిన్‌గా ఆమె సంచలనం సృష్టించింది. అయితే 'కిక్' హిట్ తర్వాత ఆమె సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద ఆడకపోవడం, రెమ్యూనరేషన్ విషయంలో కిందికి దిగక పోవడం వంటి కారణాలతో నిర్మాతలు ఆమెకంటే ఇతర తారల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. 'రెచ్చిపో', 'సలీం', 'శక్తి' సినిమాలు ఒకదాన్ని మించి మరోటి అట్టర్‌ఫ్లాప్ కావడం, రానా సరసన చేసిన 'నేను నా రాక్షసి' మంచి పేరు తెచ్చినా, బాక్సాఫీసు వద్ద ఫ్లాపవడంతో నిన్నటి దాకా ఆమెని గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే ఇవాళ ఐరన్ లెగ్ అనడం ప్రారంభించారు. ఫలితంగా కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగిపోయింది. మరోవైపు తమన్నా, తాప్సీ, సమంతా వంటి తారలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం సౌతిండియా టాప్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న తమిళ 'నంబన్' సినిమా మీదే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. ఇది బాలీవుడ్‌లో సూపర్‌హిట్టయిన '3 ఇడియట్స్'కి రీమేక్. ఇందులో ఆమె విజయ్‌కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా ఆడితే మొదట తమిళంలోనూ, తర్వాత తెలుగులోనూ తనకి మళ్లీ మంచి అవకాశాలొస్తాయనేది ఆమె నమ్మకం. మరోవైపు 'బర్ఫీ'తో బాలీవుడ్‌లోనూ అడుగు పెడుతున్న ఆమె, దానితో అక్కడా తనకి గుర్తింపు లభిస్తుందనే ఆశ పెట్టుకుంది. చూద్దాం ఏం జరుగుతుందో..

No comments: