Sunday, July 3, 2011

న్యూస్: ఆచితూచి అడుగేస్తున్న 'మొగుడు'

హీరోగా గోపీచంద్ రెండో ఇన్నింగ్స్ 'యజ్ఞం'తో సజావుగానే మొదలైంది. ఆంధ్రుడు, రణం, లక్ష్యం, శౌర్యం వంటి హిట్ సినిమాల్ని అతను అందించగలిగాడు. 'శౌర్యం' తర్వాత త్రిష జంటగా అతను చేసిన 'శంఖం' ఫ్లాపవగా, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన 'గోలీమార్' ఫర్వాలేదనిపించుకుంది. దాని తర్వాత ఎంతో నమ్మకంతో బీవీఎస్ రవి అనే రచయితని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ అతను నటించిన 'వాంటెడ్' అట్టర్‌ఫ్లాపయ్యింది. ఇలా ఓ సినిమా హిట్టయి, రెండు సినిమాలు ఫ్లాపవుతూ రావడం గోపీచంద్‌కి ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకే ఇక నుంచీ సినిమాల ఎంపికలో మరింత శ్రద్ధ పెట్టాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లే తొలిసారి కృష్ణవంశీ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్లో తయారవుతున్న ఆ సినిమా 'మొగుడు'. ఇందులో అందాలరాశి తాప్సీ నాయిక. ఇప్పటివరకు చేయని పాత్రని ఈ సినిమాలో గోపీచంద్ చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతదాకా హీరోగా అతను చేసినవన్నీ పెళ్లికాని బ్రహ్మచారి పాత్రలే. తొలిసారి పెళ్లయిన యువకుడి పాత్రను 'మొగుడు'లో చేస్తున్నాడు. ఈ సినిమా తనకి సరికొత్త ఇమేజ్‌ని ఇవ్వడమే కాక, నటుడిగా తనని మరో మెట్టు పైకెక్కిస్తునంది నమ్ముతున్నాడు గోపీచంద్. అతడి ఆశ నెరవేరుతుందో, లేదో చూడాలి.

No comments: