Wednesday, July 27, 2011

గొప్ప వ్యక్తులు: తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్ హోమై

మనదేశంలో తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్ హోమై వ్యరవల్లా. 1913లో గుజరాత్‌లోని నవసారిలో జన్మించిన 97 యేళ్ల హోమై ఇప్పటికీ సజీవురాలే. ఆమె భర్త విఖ్యాత ఫొటోగ్రాఫర్ మానెక్‌షా. ఆయన ప్రోద్బలంతోటే హోమై ఫొటో జర్నలిజంలోకి అడుగుపెట్టారు. చిత్రమేమంటే "నాకు ఫొటోగ్రఫీ తెలీదు. నిజంగా. నేనేమీ జోక్ చేయడం లేదు" అనంటుంది ఆమె. "నేను థిరీ చదువుకోలేదు. కెమెరాని ఎలా క్లిక్ చేయాలో, కేప్షన్స్ ఎలా రాయాలో, ఇంగ్లీషులో విషయాన్ని ఎలా వివరించాలో తెలుసు. 'థీరీ చదవడానికి నా టైంని వేస్ట్ చేసుకుంటే, నా ప్రాక్టికల్ పనికి ఆటంకం కలుగుతుంది' అని నాకు నేను చెప్పుకునేదాన్ని. థీరీ చదవడం వల్ల మనం చేస్తున్నది రైటా, రాంగా అనే మీమాంసలో పడి పనిని ఆలస్యం చేసేస్తాం" అని ఆమె చెబుతుంది. ఆమె వంట నేర్చుకునే తరహాలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలోనే కెమెరాని ఎలా వాడాలో నేర్చుకుందంటే ఆశ్చర్యం కలుగుతుంది.
మొదట్లో ఆమె తీసిన ఫొటోగ్రాఫులు ఆమె భర్త మానెక్‌షా పేరిటే పబ్లిష్ అవుతూ వచ్చాయి. ఆమె ఎన్నో చారిత్రక సందర్భాల్ని తన కెమెరాతో బంధించింది. భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించిన అర్థరాత్రి క్షణాల్నీ, భారతదేశ విభజనకి మన నాయకులు ఓటేసిన సంఘటననీ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎయిర్ రైడ్ ప్రికాషన్ (ఎ.ఆర్.పి.) శిక్షణలొ భారతీయ మహిళలు భాగమైన క్షణాల్నీ తన కెమరాతో బంధించింది హోమై. తనకి భారతీయ తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్‌గా గుర్తింపు దక్కడం ఆమెకేమీ గొప్పగా అనిపించదు. అదే ఆమెలోని గొప్పతనం. ద ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఈమె ఫొటోగ్రాఫులెన్నో మంచి పేరుపొందాయి. బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఉద్యోగినిగా పనిచేసిన ఆమె ఢిల్లీ ఈ మూల నుంచి ఆ మూలకి చక్కర్లు కొట్టేది. అప్పట్లో శాంతి భద్రతల పరిస్థితి బాగున్నందువల్లే రాత్రిళ్లు కూడా ఒంటరిగా ప్రయాణించ గలిగానని అప్పటి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటుంది హోమై.
భర్త మరణానంతరం 1973లో వడోదరకి మకాం మార్చిన ఆమె ప్రస్తుతం అక్కడే నివాసముంటోంది. 

No comments: