Sunday, July 24, 2011

సాహిత్యం: వ్యాసం పుట్టుక ఎప్పుడు?

19వ శతాబ్దం చివరి వరకూ వ్యాసానికి తెలుగులో ఓ రూపం రాలేదు. పాశ్చాత్య సాహిత్య ప్రభావం వల్ల వ్యాసం ఎలాగైతే భారతీయ భాషల్లో వచ్చిందో, అలాగే తెలుగులోనూ ప్రవేశించింది. అదీ 19వ శతబ్దం పూర్వార్థం అనవచ్చు.
మనకు తెలిసినంతవరకూ 1840-1850లలో సామినేని ముద్దు నరసింహం నాయని రాసిన 'హితసూచని' వ్యాసాల సంపుటమే మొదటిది. అయితే ఇది 1862లో అచ్చయింది. ఇందులో వ్యాసాల్ని 'ప్రమేయాలు' అన్నాడు రచయిత. ఇక పరవస్తు వెంకట రంగాచార్యులు (1822-1900) తమ వ్యాసాల్ని 'సంగ్రహం' అనంటే, కందుకూరి వీరేశలింగం (1848-1919) 'ఉపన్యాసము'లన్నాడు. 1852లో బ్రౌను తన నిఘంటువులో 'వ్యాసము రాసేవాడు గ్రంథకర్త' అన్నాడు. అంటే అప్పటికే వ్యాసం అన్న పేరు లోకానికి పరిచితమైందన్న మాట.
వీరేశలింగం పూర్వులూ, సమకాలికులూ ఈ వ్యాసాన్ని పరిపుష్టం చేశారు. దీన్ని నాటి పత్రికలు - ప్రధానంగా అముద్రిత గ్రంథ చింతామణి, గ్రంథాలయ సర్వస్వము, తెలుగు - ఇంకా నాటి పండితులు నడిపించిన పత్రికలూ పెంచి పోషించాయి. సాధారణంగా వ్యాసం సారస్వత విషయాల్నే వస్తువుగా కలిగి ఉండేది ఆనాడు.
వ్యాసం చిన్న రచన. సుదీర్ఘమైందీ, జటిలమైందీ, దుర్భేద్యమైందీ కాకూడదు. వ్యాసం గొప్పతనం శైలిమీద ఆధారపడి ఉంటుంది.

No comments: