Wednesday, July 27, 2011

న్యూస్: ఆ ఇద్దరి కసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

తెలుగులో, ఆ మాటకొస్తే దేశంలోనే హీరోలందరిలో నెంబర్‌వన్ డాన్సర్ అతను. సినిమా సినిమాకీ స్టైల్ మార్చే 'స్టైలిష్ స్టార్' అతను. అయినా అతనికి ఇటీవలి కాలంలో ఆశించిన హిట్లు దక్కడం లేదు. అతను అల్లు అర్జున్. రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకంతో 40 కోట్ల రూపాయలు పైగా ఖర్చుపెట్టి అతని తండ్రి అల్లు అరవింద్ నిర్మించిన 'బద్రినాథ్' సినిమా ఓపెనింగ్స్‌ని బాగానే రాబట్టినా చివరికి ఫ్లాప్‌గా లెక్కతేలింది. తన పరిచయ చిత్రం 'గంగోత్రి'కి కథనందించిన చిన్నికృష్ణ, 'బన్నీ' వంటి హిట్‌ని డైరెక్ట్ చేసిన వి.వి. వినాయక్ కాంబినేషన్ కూడా అర్జున్‌కి కలిసిరాలేదు. ఆఖరుకి మిల్కీ బ్యూటీ తమన్నా అందచందాల ప్రదర్శనా వర్కవుట్ కాలేదు. తొలిసారిగా టాలీవుడ్‌లో బద్రినాథ్ దేవాలయాన్ని నేపథ్యంగా తీసుకున్నా ప్రయోజనం కలిగించలేదు. సరైన కథా కథనాలు లోపిస్తే ఎన్ని హంగులున్నా నిష్ప్రయోజనమేనని 'బద్రినాథ్' ఉదంతం మరోసారి తేటతెల్లం చేసింది. ఇక బన్నీ ఆశలన్నీ త్రివిక్రం మీదే ఉన్నాయి. ఇప్పుడు బన్నీ నటించబోతోంది అతని దర్శకత్వంలోనే. యూనివర్సల్ మీడియా బేనర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమా తీయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం 'హనీ' అనే టైటిల్‌ని ఆయన రిజిస్టర్ చేశారు. హీరోయిన్ ఎంపికే సస్పెన్స్‌గా మారింది. ఒకసారి కాజల్ పేరు, ఇంకోసారి ఇలియానా పేరు వినిపించగా, లేటెస్ట్‌గా సమంతా పేరు తెరపైకి వచ్చింది. మొత్తానికి ఇలియానా, సమంతా.. వీరిలో ఒకరు ఖాయమయ్యే అవకాశముంది. సెప్టెంబరులో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లబోతోంది. 'మహేశ్ ఖలేజా' వంటి ఫ్లాప్‌తో త్రివిక్రం, 'బద్రినాథ్' వంటి ఫ్లాప్‌తో బన్నీ ఇప్పుడు మంచి కసి మీదున్నారు. ఆ కసి సెన్సేషనల్ మూవీని క్రియేట్ చేస్తుందా?

No comments: