Tuesday, July 26, 2011

న్యూస్: 'తెలుగమ్మాయి' వచ్చేదెప్పుడు?

ఆరేళ్ల క్రితమే టాలీవుడ్‌కు 'ధన 51' ద్వారా పరిచయమైనా ఈ మధ్యే వచ్చిన రాజమౌళి సినిమా 'మర్యాద రామన్న' తోటే పాపులర్ అయిన తార సలోని. ఆ సినిమా తర్వాత అవకాశాలు పోటెత్తుతాయనీ, టాప్ హీరోల సరసన నటించే ఛాన్సులు వస్తాయనీ ఊహించిన ఆమెకి నిరాశే ఎదురైంది. గుడ్డిలో మెల్ల అన్నట్లు 'తెలుగమ్మాయి' అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో టైటిల్ పాత్ర చేసే అవకాశం దక్కించుకుంది తెలుగు మాట్లాడ్డం రాని ఈ ఉత్తరాది అమ్మాయి. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'ఆదివారం ఆడవాళ్లకు సెలవు' చిత్రాల దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. రాజకీయ నాయకుడు, ఒకప్పటి నిర్మాత చేగొండి హరిరామజోగయ్య నిర్మాణ సారథిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఓ అమ్మాయి, నలుగురు అబ్బాయిల మధ్య నడిచే కథతో తయారైంది. ఆ నలుగురు అబ్బాయిల్లో యశ్వంత్, విక్రం (ఎమ్మెస్ నారాయణ కొడుకు) ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయి నెల రోజుల పైనే అయిన ఈ సినిమాని జూన్‌లోనే విడుదల చేయాలని మొదట నిర్మాతలు భావించారు. అయితే బిజినెస్ వర్గాల నుంచి ఎలాంటి స్పందనా, ప్రోత్సాహమూ రాలేదు. చివరికి శాటిలైట్ హక్కుల కోసమూ ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఈ నెల 24న ఆడియో ఫంక్షన్ని ఆర్భాటంగా జరిపి బయ్యర్లని ఆకట్టుకోవాలని ప్లాన్ చేశారు. తద్వారా ఆగస్టు తొలి వారంలో సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ల ఆశలు నెరవేరతాయా? బయ్యర్లు రాకపోతే సొంతంగా విడుదల చేయని పరిస్థితి ఏర్పడినట్లే. అందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారో, లేదో? ఈ సినిమాతోనన్నా మరికొన్ని ఛాన్సులు దక్కించుకోవాలని చూస్తున్న సలోని ఆశలు నెరవేరుతాయా?

No comments: