Thursday, July 28, 2011

సాహిత్యం: ఆధునిక సాహిత్యాన్ని ప్రభావితం చేసిన ఇద్దరు

ఆధునిక సాహిత్యాన్ని ఇద్దరు శాసించారు. ఒకరు కార్ల్ మార్క్స్, మరొకరు సిగ్మండ్ ఫ్రాయిడ్. మార్క్స్ సమాజంలోని వర్గ సంఘర్షణని సిద్ధాంతీకరించాడు. పెట్టుబడి వర్గాలైన ధనిక స్వామ్యానికీ, శ్రామిక వర్గాలైన కర్షక కార్మికులకూ మధ్య నిత్య సంఘర్షణ ఉంటుందని గతి తార్కిక చారిత్రక భౌతిక వాదాలతో నిరూపించాడు. ఈ భావజాలమే ప్రపంచ సాహిత్యంపైన ప్రభావం చూపించి అభ్యుదయ సాహిత్యానికి తగిన భూమికను ఏర్పాటుచేసింది. ఆ తర్వాత భౌతిక విషయాలనే కాక మనిషి మానసిక, అంతర్గత విషయాలు కూడా ఆధునిక సాహిత్యంలోకి రావడానికి తగిన ప్రాణవాయువును అందించింది ఫ్రాయిడ్ చేసిన సైకో అనాలిసిస్ థీరీ. మనిషి ప్రవర్తన వ్యక్తిగత పరిస్థితిలో ఒక రకంగా, సాంఘిక పరిస్థితిలో మరో రకంగా ఉంటుందని చెప్పాడు ఫ్రాయిడ్. మనిషి భౌతిక జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలు, అనుభూతులు, కోరికలు మెదడులో ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతూ, మరెన్నో అలోచనల్ని రేకెత్తిస్తుంటాయి. వాటిలో కొన్ని బహిర్గతమైతే, మరికొన్ని అలాగే మెదడు పొరల్లో సుప్తావస్థలో ఉండిపోతాయి. ఇలా సుప్తావస్థలో వుండిపోయిన అంశాలే నిద్రపోయేటప్పటి వ్యక్తావ్యక్త చైతన్యం (సబ్ కాన్షియస్) స్ఠితిలో అనేక ప్రతీకల రూపంలో కలలుగా వ్యక్తమవుతాయి. ఇదే కలల మెటమార్ఫసిస్ రహస్యం. దీన్ని అధ్యయనం చేసేదే సైకో అనాలిసిస్ థీరీ.

No comments: