Tuesday, July 26, 2011

న్యూస్: తాప్సీ ఆ సినిమా చేస్తుందా?

ఇలియానా తరహాలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలామంది భావించిన పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను నాలుగు సినిమాల తర్వాత కూడా అలాంటి క్రేజ్‌ని సృష్టించలేక పోయింది. తొలి సినిమా 'ఝుమ్మంది నాదం'లో ఆమెని రాఘవేంద్రరావు చూపించిన తీరు చూసి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ టాలీవుడ్ అంటూ తీర్మానించేసింది చిత్రసీమ. అయితే 'మిస్టర్ పర్ఫెక్ట్' మినహా ఆమె ఖాతాలో ఇంతదాకా మరో హిట్టు లేదు. ఆ సినిమాలోనూ ఆమెది సెకండ్ హీరోయిన్ రోలే. 'ఝుమ్మంది నాదం'తో పాటు 'వస్తాడు నా రాజు', 'వీర' ఫ్లాపయ్యాయి. ఇలియానా మాదిరిగా తొలి రెండు సినిమాలు 'దేవదాసు', 'పోకిరి' వంటివి తాప్సీకి తగిలుంటే ఆమె కూడా ఈపాటికే యువతరం కలల రాణిగా ఆవిర్భవించి ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న 'మొగుడు'లో గోపీచంద్ సరసన నటిస్తున్న ఆమె తాజాగా సునీల్ సరసన నటించేందుకు అంగీకరించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మాధవన్, కంగనా రనౌత్ జంటగా బాలీవుడ్‌లో వచ్చి సూపర్‌హిట్టయిన 'తను వెడ్స్ మను'కి ఇది రీమేక్. మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీప్రసాద్ డైరెక్టర్. అయితే ఈ సినిమాలో తాప్సీ నటించడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. కమెడియన్ అయిన సునీల్ సరసన నటిస్తే టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావని, ఇందుకు 'మర్యాద రామన్న'లో నటించిన సలోని మంచి ఉదాహరణంటూ ఆమె హితులు హెచ్చరించారనీ, అందుకే ఆమె ఆ సినిమా చెయ్యట్లేదనీ వినిపిస్తోంది. తాప్సీ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. నిజానికి తాప్సీ కంటే ముందు ఇద్దరు ముగ్గురు నేటి క్రేజీ హీరోయిన్లని నిర్మాతలు సంప్రదించారు కానీ వారు సునీల్‌తో చేయడానికి విముఖత చూపించారు. ఈ పరిస్థితుల్లో సునీల్ జోడీ తాప్సీనా లేక మరొకరు ఆ స్థానంలోకి వస్తారా?

No comments: