Tuesday, July 26, 2011

న్యూస్: జగపతిబాబు 'క్షేత్రం' మీద నమ్మకాలున్నాయా?

ఏడాదికి 10 సినిమాల్లో నటిస్తానని ఆమధ్య జగపతిబాబు ప్రకటించారు. బానే ఉంది కానీ ఆ సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితేమిటని ఫిలింనగర్ వర్గాలు అడుగుతున్నాయి. దానికి బలమైన కారణమే ఉంది మరి. జగపతిబాబు ప్రత్యేక పాత్ర పోషించిన 'జై తెలంగాణ' మినహా ఆయన హీరోగా నటించిన ఏ సినిమా ఈమధ్య కాలంలో హిట్టయ్యింది? మొన్ననే విడుదలైన 'కీ' సినిమాకి మొదటి రోజే 10 శాతం కంటే ఎక్కువమంది జనం రాలేదు. ఆ తర్వాత ఆ జనం కూడా కనిపించడం లేదు. అంతకు ముందు ప్రేంరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన 'నగరం నిద్రపోతున్న వేళ', నట్టి కుమార్ నిర్మించి, అరుణ్‌ప్రసాద్ డైరెక్ట్ చేసిన 'చట్టం' ఫ్లాప్. వాటికంటే ముందొచ్చిన 'గాయం 2', 'సాధ్యం', 'మా నాన్న చిరంజీవి', 'బంగారు బాబు' ఫ్లాప్. మధ్యలో మదన్ డైరెక్ట్ చేసిన 'ప్రవరాఖ్యుడు' అతని ప్రతిభతో ఫర్వాలేదనిపించుకుంది. ఇలా చేసిన ప్రతి సినిమా నిర్మాత కళ్ల ముందు చుక్కలు చూపిస్తుంటే జగపతిబాబుతో సినిమాలు తియ్యడానికి ఏ నిర్మాతకైనా అవసరానికి మించి ధైర్యం కావాలి. ప్రస్తుతం అలాంటి ధైర్యం చూపిస్తున్నారు 'క్షేత్రం' నిర్మాత. అవును. ఇప్పుడాయన 'క్షేత్రం' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రియమణి!. ఆ ఇద్దరూ జంటగా నటిస్తున్న నాలుగో చిత్రం. పొడవాటి మీసాలతో జగపతిబాబు ఇందులో విచిత్రంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా హిట్టవుతుందనే ఆశలు నిర్మాత, దర్శకుడికి తప్ప ఇంకెవరికైనా ఉన్నాయంటారా?

No comments: