Saturday, August 28, 2010

Movies: Balakrishna and Paruchuri Murali combo film launched


నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మించే చిత్రం షూటింగ్ శుక్రవారం (ఆగస్టు 27) రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. పరుచూరి మురళి దర్శకుడు. బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు క్లాప్‌నివ్వగా, పారిశ్రామికవేత్త కె. రఘు కెమేరా స్విచ్ఆన్ చేశారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాత ఎం.ఎల్. కుమార్ చౌదరి మాట్లాడుతూ "ఇంతకుముందు కీర్తి క్రియేషన్స్ బేనరుపై ఎనిమిది చిత్రాలు నిర్మించాను. ప్రస్తుతం కీర్తి కంబైన్స్ పతాకంపై 'బావ', 'సరదాగా కాసేపు' చిత్రాల తర్వాత నిర్మిస్తున్న మూడో చిత్రమిది. దర్శకుడు మురళితో ఇంతకుముందు 'పెదబాబు', 'ఆంధ్రుడు' చిత్రాలు నిర్మించాను. రెండూ విజయవంతమయ్యాయి. బాలకృష్ణగారితో సినిమా తీయాలని రెండేళ్ల నుంచి అనుకుంటున్నాను. ఈ చిత్రకథని సింగిల్ సిట్టింగ్‌లో బాలకృష్ణ ఓ.కె. చేశారు. దమ్మున్న సబ్జెక్ట్ ఇది. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. సెప్టెంబరు 25న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సమ్మర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాను" అన్నారు.
దర్శకుడు మురళి మాట్లాడుతూ "తొలిసారిగా ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన బాలకృష్ణగారికి రుణపడి ఉంటాను. ఆయన చేత ఓ.కె. అనిపించుకునే కథను తయారు చేయడం కోసం నేను, ఛాయాగ్రహకుడు విజయ కుమార్, సంగీత దర్శకుడు కళ్యాణిమాలిక్ ఆరునెలలు వర్క్ చేశాం. అన్ని అంశాలు సమపాళ్లలో కలగలిసిన కథ ఇది. ఊటీలో కానీ మౌంట్ ఆబులో కానీ చిత్రం షూటింగ్ ఉంటుంది" అన్నారు.
సంగీత దర్శకుడు కళ్యాణిమాలిక్ మాట్లాడుతూ "ఈ సినిమాకి పనిచేసే అవకాశం వచ్చిందని తెలియగానే వెయ్యి ఏనుగుల సవారి చేసిన అనుభూతి కలిగింది. అదరగొట్టే సంగీతాన్ని, అభిమానులు ఎగిరి గెంతులు వేసే పాటలను ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను" అన్నారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్ సి. కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సమర్పణ: సందీప్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి.

No comments: