Friday, September 17, 2010

సినిమా: 'దూకుడు' మీదున్న తమన్


మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ పేరు చూసి చాలామంది తమిళుడని మోసపోతుంటారు. కానీ అతను తెలుగువాడే. ఘనమైన నేపథ్యం కలిగినవాడే. ఆయన తాత ఎవరో కాదు ఒకప్పటి ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుని 'సీతారామ జననం'తో నటుణ్ణి చేసింది ఆయనే. అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన తమన్ 'కిక్' సినిమాకిచ్చిన సంగీతంతో తెలుగులో బిజీ అయ్యాడు. అతని తాజా చిత్రం ఎన్టీఆర్ హీరోగా నటించిన 'బృందావనం'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో బాగానే ఉందంటున్నారు. దీని తర్వాత మరో పెద్ద సినిమాకి మ్యూజిక్ నిచ్చే చాన్స్ సంపాదించేశాడు తమన్. అది మహేశ్, శ్రీను వైట్ల కలయికలో రాబోతున్న 'దూకుడు'.
మీకు తెలీని ఇంకో సంగతేమంటే శంకర్ 'బాయ్స్'లో ఒకడిగా అతను కనిపించాడు. నటన మీద ఆసక్తి లేకపోయినా శంకర్ తో పనిచేయాలనే ఉత్సాహంతో దాన్ని చేశాడు. ఆ తర్వాత నటనావకాశాలు చాలానే వచ్చినా మ్యూజిక్ మీద ఇష్టంతో వాటిని వదులుకున్నాడు. శంకర్ తమిళంలో నిర్మించిన 'ఈరమ్' మ్యూజిక్ డైరెక్టరుగా అతని తొలి సినిమా. ప్రస్తుతం హైదరాబాదులో 'తాళ్' పేరుతో రికార్డింగ్ స్టూడియో ఏర్పాటుచేసే పనిలో ఉన్న అతను తన తాత నెలకొల్పిన ప్రతిభా పిక్చర్స్ బ్యానరుని కొనసాగించి, మంచి సినిమాలు నిర్మించాలనే ఆశయంతో ఉన్నాడు.

No comments: