Friday, September 10, 2010

సినిమా: ఇక ఆశలన్నీ 'మహేశ్ ఖలేజా' మీదే!


ఉదయం ఆటతోటే 'కొమరం పులి' భవిష్యత్ తేలిపోయింది. పవన్ కల్యాణ్ డైరెక్టరుగా పరిచయమవుతూ తీసిన 'జానీ'ని మించిపోయిందని అంతటా వినిపిస్తోంది. 'ఈ సినిమాకా ఇన్ని గొడవలు జరుగుతోంది' అన్ని విస్తుపోయేలా పరమ బోరింగుగా ఉన్న ఈ సినిమాని నిర్మించిన శింగనమల రమేశ్ వైపు అందరూ జాలి చూపులు చూస్తున్నారు. 15 నుంచి 17 కోట్ల రూపాయల డెఫిసిట్ తో రిలీజైన ఈ సినిమాకి నష్టాలు పూడ్చుకోవడం కల్ల అని తేలిపోయింది. దాంతో తన మరో ప్రాజెక్ట్ 'మహేశ్ ఖలేజా' వైపు వెంటనే దృష్టి సారించారు రమేశ్. నిన్నటిదాకా ఆ సినిమాని అక్టోబర్ 7న రిలీజ్ చేయాలని ఆయనా, ఆయన భాగస్వామి సి. కల్యాణ్ అనుకున్నారు.
కానీ రాత్రి నుంచే ఈ సినిమా మీద అన్ని ప్రాంతాల నుంచీ బాడ్ టాక్ రావడంతో శుక్రవారం ఉదయమే 'ఖలేజా'ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించేశారు. 'కొమరం పులి' రిలీజ్ అయిన రోజు సాధారణ పరిస్థితుల్లో అయితే ఫోకస్ అంతా ఆ సినిమా మీదే ఉండాలి. కానీ అలా కాకుండా ఆ సినిమా రిలీజ్ రోజు 'ఖలేజా' గురించి మాట్లాడారంటే వాళ్లే 'కొమరం పులి' బాక్సాఫీసు ఫలితాన్ని గురించి చెప్పినట్లయ్యిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. బయ్యర్లను దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఈ ప్రకటన చేశారనేది ఆ వర్గాల వాదన. మొత్తానికి 'పులి' అందర్నీ భయపెడుతోంది. ఆ సినిమాని కొన్న పలు ప్రాంతాల బయ్యర్లు ఇప్పటికే ఆందోళనలో మునిగిపోయారని సమాచారం. ఇప్పటికే వివాదాల్లో ఉన్న ఆ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని వివాదాలను సృష్టించేలా కనిపిస్తోంది.

No comments: