Tuesday, June 5, 2012

రామ్‌దేవ్‌కు గడ్కారీ పాదాభివందనం

బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సోమవారం యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు పాదాభివందనం చేశారు. తాను రామ్‌దేవ్ పాదాలకు నమస్కరించడం గౌరవంతో కూడుకున్నదని, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం తప్పేమీ కాదని గడ్కారీ పేర్కొన్నారు. ‘కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి మన వద్దకు వస్తే ఆయన దీవెనలు తీసుకోవాలని మన సంస్కృతి చెపుతోంది. నేను అదేవిధంగా చేశాను. బాబా ఆశీర్వాదం తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. మన సంస్కృతిని పాటించని వారు వేరే విధమైన ప్రవర్తనను కలిగి ఉంటారు’ అని గడ్కారీ అన్నారు. విదేశాల్లో దాగున్న నల్లడబ్బును భారత్‌కు తిరిగి తెచ్చేందుకు చేపట్టిన ఉద్యమానికి బీజేపీ మద్దతు కోరుతూ రామ్‌దేవ్ ఢిల్లీలోని గడ్కారీ నివాసానికి వెళ్లిన సమయంలో... ఆయన రామ్‌దేవ్ పాదాలకు నమస్కరించారు. పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం, నల్లధనం అంశంపై వారిద్దరూ సమావేశమై చర్చించారు. ఇదిలా ఉండగా, ప్రతిపక్షాలు, పౌర సమాజంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా విమర్శలు చేయడంపై బీజేపీ చీఫ్ గడ్కారీ మండిపడ్డారు. ఆమె ఆరోపణలు నిరాధారమన్నారు. నల్లధనాన్ని వెనక్కి తేవాలన్న రామ్‌దేవ్ డిమాండ్ జాతి వ్యతిరేకమని కాంగ్రెస్ భావిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ నెల 24న నాగ్‌పూర్‌లో జరగనున్న తన కొడుకు సారంగ్ పెళ్లికి రావాలని గడ్కారీ.. సోనియాను వ్యక్తిగతంగా కలుసుకుని ఆహ్వానించారు. 

No comments: