Tuesday, June 19, 2012

నారాయణరావు మాస్టారి కథ


ఇంతకుముందు దినపత్రిక ఎడిటర్ రఘురామ్ ('ఆ నలుగురు'), రాజాజీ ('మీ శ్రేయోభిలాషి') పాత్రల్లో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న రాజేంద్రప్రసాద్ తాజాగా నారాయణరావు మాస్టారుగా తెరమీద కనిపించబోతున్నారు. ఆయన ఆ పాత్ర పోషిస్తున్న 'ఓనమాలు' చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుని విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. సన్‌షైన్ సినిమా పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె. క్రాంతిమాధవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా గురించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "ఎన్నో సినిమాల్లో నటిస్తున్నా కొన్ని సినిమాలకే ఉద్వేగం, ఏదో చెయ్యాలన్న ఉత్సాహం కలుగుతుంది. అటువంటి ఉత్సాహం కలిగించిన సినిమా ఇది. ఇందులోని నారాయణరావు మాస్టారు పాత్ర నా మనసుకు బాగా నచ్చిన పాత్ర. ఎన్టీఆర్‌కి, ఎఎన్నార్‌కి వాళ్ల కెరీర్‌లో వయసుతో నిమిత్తం లేకుండా మంచి పాత్రలు దొరికాయి. అలా నాక్కూడా ఇదో మంచి అవకాశం. ఇవాళ మన సమాజానికి కచ్చితంగా కావాల్సిన అనుబంధాల్ని చెప్పే సినిమా'' అని చెప్పారు.
నిర్మాత, దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ "మనిషి ఓడలాంటివాడు. ఒడ్డుకు చేరితేనే ఓడకు ఎలాగైతే విలువ వస్తుందో, అలాగే మనిషి కూడా ఏదో ఓ విజయపు ఒడ్డుకు చేరితేనే విలువ. ఇందులో ఓ స్కూలు మాస్టారు ఎలాంటి ఒడ్డుకు చేరాడన్నది కథ. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు.
ఈ చిత్రానికి కథ: తమ్ముడు సత్యం, మాటలు: ఖదీర్‌బాబు, సంగీతం: కోటి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కూర్పు: గౌతంరాజు, కళ: బాబ్జీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. క్రాంతిమాధవ్.

No comments: