Saturday, June 16, 2012

'ఎందుకంటే ప్రేమంట'ను ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారు

రామ్, తమన్నా జంటగా తను రూపొందించిన 'ఎందుకంటే ప్రేమంట!'లోని కొత్తదనాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారనీ, సినిమాకి వస్తున్న బ్రహ్మాండమైన స్పందనే దీనికి నిదర్శనమనీ దర్శకుడు ఎ. కరుణాకరన్ చెప్పారు. శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా కరుణాకరన్ మాట్లాడుతూ "చచ్చిన తర్వాతనే ఆత్మ ఉంటుందని అనుకుంటున్నారే తప్ప అసలు నిజమేంటో ఎవరికీ తెలీదు. నేను కోమాలో ఉన్న అమ్మాయి ఆత్మ హీరో సాయంతో తనని బతికించుకోవడం చూపించాను. ఇది అద్భుతమైన ప్రేమకథ. ఈ సినిమాని మెదడుతో చూడొద్దు, ఆత్మతో చూడండి. అందరూ చాలా చక్కని ఎమోషనల్ లవ్‌స్టోరీగా ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చేయని రీతిలో ఎంతో ఎనర్జిటిక్‌గా డాన్సులు చేశాడు రామ్'' అని చెప్పారు. నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ "ఎ, బి సెంటర్లలో సినిమా బాగా ఆడుతోంది. ఓ మంచి సినిమా చూద్దామనుకునే వాళ్లకి సంతృప్తినిస్తోంది. ఏ సినిమాకీ వెంటనే బాగుందని జనం చెప్పలేదు. 'గీతాంజలి', 'దేవదాసు' వంటి సినిమాలు కూడా చాలా రోజుల తర్వాతనే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతానికి కలెక్షన్లు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇది నవ్యతను కోరుకునేవాళ్ల కోసం తీసిన సినిమా. చూసినవాళ్లంతా ఫ్రెష్‌గా ఫీలవుతున్నారు. రామ్, తమన్నా జంట ముచ్చటగా ఉందని చెబుతున్నారు. చివరలో రామ్ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్స్‌కి చప్పట్లు కొడుతున్నారు. దర్శకుడు కరుణాకరన్ బాగా తీశాడు. కొన్ని రోజులైనా గుర్తుండిపోయే సినిమా. ఇది ఎంత వసూలు చేస్తుందనేది తెలియడానికి కొంత టైమ్ పడుతుంది'' అన్నారు.

No comments: