Tuesday, June 12, 2012

బాలయ్య కోసం ఇరవై ఏళ్లయినా వెయిట్ చేస్తా


"బాలకృష్ణకు రెండేళ్ల క్రితం 'నరసింహస్వామి' అనే కథ చెప్పా. ఓకే అయ్యింది. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా. బాలయ్య కోసం ఇరవై ఏళ్లయినా వెయిట్ చేస్తా'' అని చెప్పారు దర్శకుడిగా మారిన నటుడు జీవీ సుధాకరనాయుడు. ఆయన రాబోయే రోజుల్లో తన ప్రణాళికల గురించి పత్రికల వారికి తెలియజేశారు. "త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టి అనిల్‌కపూర్, నానాపటేకర్, రేఖ కాంబినేషన్‌లో 'శత్రు' అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నా'' అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు బయటి బేనర్లలో 'హీరో', 'రంగ ది దొంగ' సినిమాల్ని డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు సొంతంగా జీవీ మూవీస్ అనే బేనర్‌ను నెలకొల్పారు.
"ఈ బేనర్‌పై తొలిసారిగా 'రెడ్డిగారి మనవడు' అనే సినిమాని నిర్మించబోతున్నా. 'ద ప్రిన్స్ ఆఫ్ రాయలసీమ!' అనేది ఉప శీర్షిక. దీనికి నేను నిర్మాతను మాత్రమే. ఓ సీనియర్ డైరెక్టర్ దీన్ని రూపొందిస్తారు. కథ నాదే. టైటిల్ ప్రకారం రాయలసీమకు చెందిన ఓ పవర్‌ఫుల్ రెడ్డిగారు, ఆయన మనవడి చుట్టూ నడిచే కథ. రెడ్డిగారు ఏ రోజున పుట్టారో అదే రోజు మనవడు కూడా పుడతాడు. తాత ఎంత నీచుడో మనవడు అంతకంటే నీచుడు. 'దండంపెట్టి ఓటడిగేవాడు అన్నం పెడతానంటేనే ఓటెయ్' అని జనానికి చెబుతుంటాడు హీరో. రాయలసీమ ఫ్యాక్షన్, దాని ద్వారా వచ్చే అధికారం, దాన్ని ఉపయోగించుకుని సంపాదించే డబ్బు... వీటి చుట్టూ అల్లిన కథ. ఇందులో ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ కూడా ఉంది. రెడ్డిగారికి ప్రత్యర్థి అయిన చౌదరి కూతురు, హీరో ప్రేమించుకోవడం, వారి ప్రేమకూ, రాజకీయాలకూ లంకె ఉండటం ఇందులోని ఇంటరెస్టింగ్ పాయింట్. రాజకీయం వ్యాపార స్థాయికి ఎలా ఎదిగిందో ఈ కథలో చెబుతున్నా. వచ్చే ఉప ఎన్నికల ఫలితాల్ని బట్టి ఈ కథకు క్లైమాక్స్ రాస్తా. అప్పుడే హీరోకి పేరు పెడతా. రెడ్డిగారి పాత్రకు కోట శ్రీనివాసరావును అనుకుంటున్నాం. హీరో ఛాయిస్‌ను డైరెక్టర్‌కి వదిలేస్తున్నా. ఇందులో ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, జయసుధ, రమ్యకృష్ణ, ముమైత్‌ఖాన్ తదితరులు నటిస్తున్నారు. చక్రి సంగీతం సమకూర్చబోతున్నారు'' అని తెలిపారు జీవీ. ఈ సినిమా వివాదాల్ని రేకెత్తించే అవకాశాలున్నాయి కదా అనడిగితే "తప్పకుండా కాంట్రవర్సీ అవుతుంది. అవనీయండి. అవ్వాలనే కోరుకుంటున్నా'' అని ఆయన చెప్పారు.

No comments: