Monday, June 11, 2012

టీనేజ్ అబార్షన్లపై దృష్టిపెట్టిన 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'


"పిల్లలతో సెక్స్ గురించి చర్చించే ధైర్యం పెద్దలకి లేకపోవడంతో టీన్ అబార్షన్స్ పెరిగిపోతున్నాయి. టీనేజ్ లవ్, టీనేజ్ సెక్స్ సమాజాన్ని ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఈ సినిమాలో చూపించా'' అని చెప్పారు పి. సునీల్‌కుమార్‌రెడ్డి. డిజిక్వెస్ట్ ఇండియా సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'కు ఆయన దర్శకుడు. ఈ నెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సునీల్‌కుమార్‌రెడ్డి చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే... 
ఇది నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద తీసిన సినిమా. టీన్ సెక్సువాలిటీ మీద ఫోకస్ చేసిన సినిమా. బైక్స్, గర్ల్‌ఫ్రెండ్స్ స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న అబ్బాయిలు తమ కోరికల కోసం చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకీ, పిల్లలకీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతోంది. చదువులేని వాళ్లకంటే చదువుకున్నవాళ్లే తప్పుదోవ పడుతున్నారు. పోలీసు రికార్డులు ఈ సంగతే చెబుతున్నాయి. ప్రతి నేరంలో ఓ రొమాన్స్ ఉంటుంది. మనుషులు తాము ప్రేమించిన వాళ్లకోసం నేరాలు చేస్తుంటారు. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' అని టైటిల్ పెట్టడానికి కారణం ఇదే.
ఏదీ రహస్యం కాదు
ఈ కథ కోసం ఎంతోమంది కాలేజీ పిల్లల్ని కలిసి మాట్లాడా. వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఇష్టాయిష్టాలు ఏమిటో ప్రతిఫలింపజేశా. వాళ్ల దృష్టికోణం నుంచే ఈ సినిమా తీశా. ఎక్కడా వల్గారిటీ వైపు పోకుండా ఈస్థటిక్‌గా, అందరూ కలిసి చూడదగ్గ రీతిలో తీశా. 'ప్రతి పరదా వెనుక ఓ రహస్యం ఉంది' అనే ట్యాగ్‌లైన్ పెట్టాను. సీరియస్ సబ్జెక్టుని వినోదాత్మకంగా చెప్పా. తప్పుచేసిన వాళ్లు తాము దొరకం అనుకుంటే తప్పే. ఏదీ రహస్యం కాదనీ, దాపరికం అనేది ఏదో ఓ రోజు బయటపడుతుందనీ చెబుతున్నాం. ఇది ఓ టెన్ల్‌క్లాస్ అమ్మాయి, ఇంకో ఇంటర్మీడియేట్ అమ్మాయి, మరో ఇంజనీరింగ్ విద్యార్థిని - ఈ ముగ్గురి చుట్టూ నడిచే కథ. ఆ పాత్రల్ని గాయత్రి, దివ్య, స్వప్న చేశారు. హీరోలుగా ఇదివరకు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన మనోజ్ నందం, అనిల్ కల్యాణ్ నటించారు.
ఆ ఉద్దేశంతోనే ఈ సినిమా
అవార్డులు పొందిన 'సొంతవూరు', 'గంగపుత్రులు' సినిమాలు ఎక్కువమంది ప్రేక్షకులకు ఎందుకు చేరలేదనే ప్రశ్న నుంచి పుట్టిన సినిమా ఇది. ఇవాళ సినిమాలు ఎక్కువగా చూస్తోంది యువతే. వాళ్లకు సంబంధించిన విషయంతో సినిమా తీస్తే వాళ్లు సొంతం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ సినిమా తీశా. నా సినిమాల్లో బిజినెస్‌పరంగా కూడా సంతృప్తికరమైన స్పందన వచ్చింది దీనికే. సినిమాకి స్ట్రక్చర్ కంటే ఎమోషన్ ఇంపార్టెంట్ అనేది నేను తెలుసుకున్న నిజం.
సెన్సిబుల్ సబ్జెక్టుకి కమర్షియాలిటీ
సమాజాన్ని ప్రతిబింబించే, సమాజానికి సంబంధం ఉండే కథలతో సినిమాలు తియ్యాలనుకునే వాళ్లలో నేనొకణ్ణి. సినిమా అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని నమ్ముతా. ఇకనుంచీ సెన్సిబుల్ సబ్జెక్టులకే కమర్షియాలిటీ జోడించి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నా. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' తర్వాత ఓ కళారూపం నేపథ్యంలో సినిమా తీయాలనుకుంటున్నా. దానికి ఎల్బీ శ్రీరామ్‌తో కలిసి ఓ స్క్రిప్టు తయారు చేస్తున్నా.

No comments: