Monday, June 18, 2012

సినిమాగా పుట్టపర్తి సాయిబాబా చరిత్ర


పుట్టపర్తి సాయిబాబా మహిమలతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సౌభాగ్య చిత్ర పతాకంపై నిర్మితమవుతోంది. కరాటం రాంబాబు నిర్మాత. చిత్ర విశేషాలను దర్శకుడు కోడి రామకృష్ణ వివరిస్తూ "సాయి భక్తులను స్వయంగా కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకుని కథ సిద్ధం చేసుకున్నాం. ఆరునెలలు, 8, 10, 14, 35, 50, 85 ఏళ్ళ బాబా పాత్రధారులను ఈ చిత్రంలో చూడొచ్చు. స్క్రీన్ మీద ఎక్కువ సేపు కనువిందు చేసే బాబా పాత్రధారి కోసం ఎందరెందరినో అనుకున్నాం. మలయాళ నటుడు దిలీప్‌ను ఎంపిక చేశాం. ఈ విషయమై ఆయనకు ఫోన్ చేయగానే 'నేను ఇంతకుముందే బాబా గురించి ఆలోచించాను. అంతలో మీరు ఇలా ఫోన్ చేయడం ఆ భగవంతుడి సంకల్పమేమో' అని అన్నారు. ఇళయరాజా సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్. ఇందులో 14 పాటలున్నాయి. అన్నీ కథాగమనానికి తోడ్పడేవే'' అని చెప్పారు.
నిర్మాత కరాటం రాంబాబు మాట్లాడుతూ "తొలి షెడ్యూల్‌ను పుట్టపర్తిలో, రెండో షెడ్యూల్‌ను పశ్చిమ గోదావరి పరిసరాల్లో చిత్రీకరించాం. బాబా పాత్రకు సంబంధించిన సన్నివేశాలను, కరణం సుబ్బమ్మ ఇంటి దృశ్యాలను తెరకెక్కించాం. స్థానిక పుట్టాయిగూడెంలో వేసిన బాబా సెట్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంది. బ్రిటిష్ కాలానికి సంబంధించిన పరిసరాలను ప్రతిఫలించేలా వేసిన సెట్‌లో బాబాకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించాం. దీంతో 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. బాబా పాత్రధారికి విదేశీ నిపుణులు మేకప్ వేస్తున్నారు. మిగిలిన అన్ని పాత్రలకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్‌మేన్‌లను పిలిపిస్తున్నాం. మా సంస్థలో సంచలనాత్మక చిత్రమవుతుంది. త్వరలో పేరును ప్రకటిస్తాం. ప్రశాంతి నిలయం సెట్‌ను కోటి రూపాయల వ్యయంతో అత్యంత భారీ స్థాయిలో హైదరాబాద్‌లో వేస్తున్నాం. ఆర్ట్ డైరక్టర్ నాగు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అనువణువూ పరిశీలించి సెట్‌ను తీర్చిదిద్దుతున్నారు'' అని అన్నారు.
దిలీప్, జయప్రద, శరత్‌బాబు, సుకుమారి, సిజ్జు, కె.వి.రమణాచారి.ఐ.ఎ.ఎస్., శ్రీజిత్ విజయ్, లక్ష్మి, అమృత, అర్చన, రూపాలక్ష్మి, సుజాత, తులసి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: కరాటం రాంబాబు, దర్శకత్వం: కోడి రామకృష్ణ, సినిమాటోగ్రాఫర్: వాసు, సంగీతం: ఇళయరాజా, రచన: రాజేంద్రకుమార్, సాహిత్యం: జొన్నవిత్తుల, కళ: నాగు, ఎడిటర్: నందమూరి హరి.

No comments: