Tuesday, November 8, 2011

డైరెక్టర్ కాబోతున్న హీరోయిన్!

ప్రఖ్యాత కవి, రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ మనవరాలైన నిశాంతి 'ఎల్బీడబ్ల్యూ' సినిమాతో నాయికగా తెరంగేట్రం చేసింది. ఆమె తండ్రి కూడా సంగీత సాహిత్యాల్లో ప్రవీణుడే. ఆయన ఇ.ఎస్. మూర్తి. పలు సినిమాలకు పాటలు రాసిన ఆయన కొన్ని సినిమాలకు సంగీతాన్నీ సమకూర్చారు. అందువల్లే నిశాంతికీ సాహిత్యం పట్ల ఆసక్తి. "తీరిక వేళల్లో సినిమాలు చూస్తుంటా. పుస్తకాలు చదువుతా. ఇప్పుడు తెలుగు సాహిత్యమే చదువుతున్నా. తాతయ్య, నాన్న ఆ రంగానికి చెందినందున నేనూ దానిపట్ల ఆకర్షితురాలినయ్యా" అని ఆమె తెలిపింది. ముంబైలో డైరెక్షన్ కోర్సు చేసి, మొదట ఓ కన్నడ సినిమాకి అసెస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమె దేశవ్యాప్తంగా పేరొందిన 'ఇక్బాల్' సినిమాకి నగేశ్ కుకునూర్ వద్ద కూడా పనిచేసింది. "అవకాశాల్ని బట్టి నటిగా కంటిన్యూ అవుతా. అయితే నా ఆశయం మాత్రం డైరెక్టర్ కావడమే. 'అలా మొదలైంది'తో నందినీరెడ్డి మంచి పేరు తెచ్చుకున్నాక, నా కోరిక మరింత బలపడింది. ఇప్పటికే మంచి సబ్జెక్ట్ తయారుచేసుకున్నా. త్వరలోనే డైరెక్షన్ చేస్తాననుకుంటున్నా" అని చెప్పింది నిశాంతి.

No comments: