Thursday, November 10, 2011

ఏడేళ్ల తర్వాత బాలయ్యతో పరుచూరి బ్రదర్స్!

'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల కాంబినేషన్ బాలకృష్ణ, పరుచూరి బ్రదర్స్ ఏడేళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్నారు. చివరిసారిగా వారు 'లక్ష్మీనరసింహా' సినిమాకి పనిచేశారు. ఇప్పుడు ఇన్నాళ్లకి వారు 'హరహర మహాదేవ' సినిమా కోసం కలిశారు. బి. గోపాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్నారు. 'లక్ష్మీ నరసింహా' నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం. ఇక బి. గోపాల్ విషయానికొస్తే ఎనిమిదేళ్ల తర్వాత ఆయన బాలకృష్ణని డైరెక్ట్ చేస్తున్నాడు. 2003లో వచ్చి ఘోరంగా ఫెయిలైన 'పలనాటి బ్రహ్మనాయుడు' సినిమాకి చివరగా ఆ ఇద్దరూ కలిసి పనిచేశారు. దీనికి రచన చేసింది కూడా పరుచూరి సోదరులే. ఇప్పుడు ఈ నలుగురి (పరుచూరి బ్రదర్స్ ఇద్దరు కాబట్టి) కలిసి 'పలనాటి బ్రహ్మనాయుడు' చేదు అనుభవాన్ని మర్చిపోవాలనే కసితో పనిచేస్తున్నారు. పవర్‌ఫుల్ డైలాగ్స్‌కి పెట్టింది పేరైన బ్రదర్స్ ఇందులో 'సై అంటే శరభ శరభ.. జై అంటే ఆయుష్మాన్‌భవ.. కాదని ఎదురొస్తే హరహర మహాదేవ' వంటి శక్తివంతమైన డైలాగులు రాశారు. అయితే ఏ సినిమాకైనా కథే ప్రాణాధారం కాబట్టి 'హరహర మహాదేవ' కథ విషయంలో బి. గోపాల్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. మంచి పాటలు, యాక్షన్ పార్ట్, పవర్‌ఫుల్ కేరక్టర్, కావలసినంత సెంటిమెంట్ రంగరించి ఈ సినిమా కథని వండారు. ఈ సినిమాతో పునర్వైభవం పొందాలని ఇటు పరుచూరి బ్రదర్స్, అటు బి. గోపాల్ చేస్తున్న కృషి ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి.

No comments: