Friday, November 4, 2011

న్యూస్: రాజేంద్రప్రసాద్ ఫుల్ బిజీ!

చాలా రోజుల తర్వాత వెటరన్ కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ సినిమాలతో బాగా బిజీ అయ్యారు. గోపీచంద్ తండ్రిగా ఆయన చేసిన 'మొగుడు' శుక్రవారం (4న) విడుదల కాబోతోంది. 'ఆ నలుగురు' తర్వాత ఆయనకు మళ్లీ అంత పేరు ఇందులోని ఆంజనేయప్రసాద్ కేరక్టర్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. వెరైటీ గెటప్‌తో ఆయన చేసిన 'డ్రీం' సినిమా షూటింగ్ పూర్తయింది. కె. క్రాంతిమాధవ్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఇంకా పేరుపెట్టని సినిమాలో ఆయన నారాయణరావు మాస్టారు అనే ఉపాధ్యాయుడి పాత్ర చేశారు. "ఎన్నో సినిమాల్లో నటిస్తున్నా కొన్ని సినిమాలకే ఉద్వేగం, ఏదో చెయ్యాలన్న ఉత్సాహం కలుగుతుంది. నారాయణరావు పాత్ర అలాంటిదే" అని చెప్పారు రాజేంద్రప్రసాద్. వీటితో పాటు గుణశేఖర్, రవితేజ కాంబినేషన్ సినిమా 'నిప్పు', అల్లు అర్జున్, త్రివిక్రం కలిసి చేస్తున్న 'హనీ' (టైటిల్ ఇంకా ధృవీకరించలేదు), ఆది హీరోగా జయ బి. డైరెక్ట్ చేస్తున్న సినిమాలను ఆయన చేస్తున్నారు. అలాగే 'క్విక్‌గన్ మురుగన్ 2' సినిమానీ ఆయన చేయనున్నారు. హిందీలోనూ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. "ఇంకా చాలానే ఉన్నాయి. ఇంత బిజీగా మళ్ళీ గడుపుతానని అనుకోలేదు'' అని ఉత్సాహంగా చెప్పారు రాజేంద్రప్రసాద్.

No comments: