Tuesday, November 8, 2011

తొమ్మిదేళ్లు... తొమ్మిది మంది కొత్త దర్శకులు!

కొత్త దర్శకులంటే సిద్ధార్థ్‌కి మోజెక్కువ. అందుకే తొమ్మిదేళ్ల కెరీర్‌లో సరిగ్గా తొమ్మిది మంది కొత్త దర్శకులతో పనిచేశాడు. ఈ వరుసలో వస్తున్న అతడి తదుపరి సినిమా 'ఓ మై ఫ్రెండ్'తో కరీంనగర్‌కి చెందిన వేణుశ్రీరాం దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఇదే సినిమాతో కేరళకు చెందిన రాహుల్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఆడియో సక్సెస్ అవడంతో ఈ సినిమా విజయంపై సిద్ధుతో పాటు నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. తమ బేనర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు వచ్చాయనీ, కానీ 'ఓ మై ఫ్రెండ్' గ్రేట్ ఫిల్మ్ అవుతుందనీ గొప్పగా చెప్పాడు. సిద్ధు విషయానికొస్తే అతడి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ఫేమస్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్టర్‌గా అవతారమెత్తి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత కాలంలో సిద్ధు నటించిన 'చుక్కల్లో చంద్రుడు' ద్వారా మణిరత్నం శిష్యుడు శివకుమార్, 'బొమ్మరిల్లు' ద్వారా భాస్కర్, 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ద్వారా డాలీ, 'ఓయ్!'తో ఆనంద్ రంగా, 'బావ'తో రాంబాబు, 'అనగనగా ఓ ధీరుడు'తో సూర్యప్రకాశ్, '180'తో జయేంద్ర డైరెక్టర్లుగా పరిచయమయ్యారు. వీరిలో ప్రభుదేవా, భాస్కర్ మాత్రమే సక్సెసయ్యారు. '180' సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని సిద్ధు గట్టిగా నమ్మాడు. అయితే విమర్శకుల ప్రశంసలు పొందిన స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలవలేకపోయింది. ఇప్పుడు 'ఓ మై ఫ్రెండ్'తోనైనా అతడికో హిట్టు వస్తుందేమో చూడాలి.

No comments: