Saturday, November 5, 2011

'ప్రియుడు' మీద నమ్మకం పెట్టుకున్న నటి

చూపులకి అక్క అమృతా రావ్ని గుర్తుకుతెచ్చే ప్రీతికా రావ్ 'ప్రియుడు' సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. నటి కాకముందు ప్రీతిక ఓ ఫిల్మ్ జర్నలిస్ట్, మోడల్ కావడం గమనార్హం. 'ప్రియుడు'లో ఆమె వరుణ్ సందేశ్ జోడీగా కనిపించబోతోంది. అయితే ఆమె హైదరాబాద్‌కి తొలిసారి వచ్చింది ఈ సినిమా షూటింగ్ కోసం కాదు. అక్క అమృత, తల్లితో కలిసి 'అతిథి' సినిమా షూటింగ్ సందర్భంగా తొలిసారి వచ్చింది. ఆ సినిమాలో మహేశ్ సరసన అమృత హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ప్రీతిక హీరోయిన్‌గా పరిచయమైన సినిమా ఆర్య సరసన నటించిన తమిళ చిత్రం 'చిక్కు బుక్కు'. మణికందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2010లో రిలీజైంది. ఓ డైలీలోని ప్రీతిక రాసిన కాలంలో ఆమె ఫోటోచూసి మణికందన్ 'చిక్కు బుక్కు'లో అవకాశమిచ్చాడు. 
నిజానికి ప్రీతిక టెన్త్ క్లాస్ చదివేప్పుడే తెలుగు సినిమాలో ఆఫర్ వచ్చింది. అయితే అప్పుడు చదువు మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఆ ఆఫర్‌ని తిరస్కరించింది. ఇప్పుడు వివిధ దేశాల్లో 50 దాకా కమర్షియల్ యాడ్స్ చేసిన ప్రీతిక ఇది సరైన సమయంగా భావించి తెలుగులో అడుగుపెట్టింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పేసుకుని, పరుగులు పెట్టాలని ఆమె భావించడం లేదు. మంచి పాత్రలే చేయాలనేది ఆమె ఉద్దేశం. హిందీ సినిమాల్లోకి వెళ్లడానికి తెలుగు ఓ స్టెప్పింగ్ స్టోన్‌గా ఉపయోగపడుతుందని కూడా ఆమె అనుకోవడం లేదు. ముంబై చిత్రసీమ మాదిరిగానే తెలుగు చిత్రసీమ కూడా చాలా పెద్దదనీ, ప్రస్తుతం ఎన్నో తెలుగు సినిమాలు అక్కడ రీమేక్ అవుతున్నాయనీ ఆమె అంటోంది. 'ప్రియుడు' సినిమా తనకి తెలుగులో బ్రేక్ ఇస్తుందని గట్టిగా నమ్ముతుందామె.

No comments: