Tuesday, November 1, 2011

జెనీలియాని జనం ఇష్టపడతారా?

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'సత్యం' (2003)తో గ్రాండ్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జెనీలియాకి రాం సరసన నటించిన 'రెడీ' తర్వాత మరో హిట్ దక్కలేదు. 'శశిరేఖా పరిణయం', 'కథ', 'ఆరంజ్' సినిమాలు ఫట్టయ్యాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే సినిమా రానా సరసన 'నా ఇష్టం' చేస్తోంది. ఇదివరకు 'సింహా' వంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన యునైటెడ్ మూవీస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండగా ప్రకాశ్ తోలేటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. వాస్తవానికి 'నా ఇష్టం' అనేది రాంగోపాల్‌వర్మ రాసిన పుస్తకం పేరు. ఆ పేరుని క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై జోగినాయుడు ఫిలించాంబర్ వద్ద రిజిస్టర్ చేశాడు. అల్లరి నరేశ్ హీరోగా, పరశురాం డైరెక్షన్‌లో ఆ పేరుతో సినిమాని తీయాలని ఆయన అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చకపోవడంతో టైటిల్‌ని యునైటెడ్ మూవీస్ అధినేత పరుచూరి శివరామప్రసాద్‌కి ఇచ్చేశాడు. ఈ సినిమాలో మీసాలు తీసేసి కొత్తగా కనిపిస్తున్నాడు రానా. అతనితో జెనీలియా జోడీ ఎలా ఉంటుందనే ఆసక్తి చాలామందిలో వ్యక్తమవుతోంది. 'బొమ్మరిల్లు', 'ఢీ', 'రెడీ' విజయాలతో టాప్ స్లాట్‌లోకి వస్తుందనుకున్న జెనీలియా హఠాత్తుగా వెనుకంజ వేయడం చిత్రమే. ముఖ్యంగా కృష్ణవంశీ తీసిన 'శశిరేఖా పరిణయం', 'భాస్కర్ తీసిన 'ఆరంజ్' సినిమాల్లో ఆమె ఓవరాక్షన్ ప్రేక్షకులకి చికాకు తెప్పించింది. దానివల్లే ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు 'నా ఇష్టం'లో ఆమె నటన ఎలా ఉంటుందో వేచిచూడాలి. ఈ సినిమా అటు రానాకీ, ఇటు జెనీలియాకీ కీలకమే. చూద్దాం ఏమవుతుందో...

No comments: