Saturday, November 19, 2011

ఇంటర్‌వ్యూ: సిద్ధార్థ్

కుర్రాళ్లు కాలేజీ ఎగ్గొట్టి 'ఓ మై ఫ్రెండ్' చూస్తున్నారు




"యువతకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. కాలేజీకి ఎగ్గొట్టి మరీ చూస్తున్నారు'' అని చెప్పారు సిద్ధార్థ్. ఆయన హీరోగా వేణుశ్రీరామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్' ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
'బొమ్మరిల్లు'లాంటి సినిమా తర్వాత దిల్‌రాజు బేనర్‌లో నేను చేసిన సినిమా కాబట్టి కచ్చితంగా అంచనాలుంటాయి. డైరెక్టర్ వేణు నా కోసం రెండేళ్లు ఎదురుచూశాడు. అంతకాలం ఎదురు చూడాలంటే గట్స్ ఉంటాలి. ప్రధాన పాత్రకు నేనే కావాలని నా మీద నమ్మకం పెట్టాడు. రాజు కూడా నాతోనే దీన్ని తీయాలనుకున్నాడు. ఇది ఒక హీరో సినిమా కాదు. నాలుగు కేరక్టర్ల సినిమా. నిజమైన స్నేహం, నిజమైన ప్రేమ గురించి దీనిలో చెప్పాం. దాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఫ్యామిలీల్లోకి వెళ్లాలి
యువతకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. కాలేజీకి ఎగ్గొట్టి మరీ చూస్తున్నారు. హైదరాబాద్‌లో ఐదు థియేటర్లకు వెళ్లి చూశాం. ఎక్కువగా కనిపించింది కాలేజీ కుర్రాళ్లే. ఇక ఈ సినిమా వెళ్లాల్సింది ఫ్యామిలీల్లోకి. అది కూడా జరుగుతుంది. ప్రస్తుతం వాళ్లు కూడా థియేటర్లలో కనిపిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ రెవెన్యూపరంగా సంతోషంగా ఉన్నారు.
20 నిమిషాలే బలం
కొత్తగా ఈ సినిమాలో ఏముంది అనేవాళ్లకి నా సమాధానం ఒక్కటే. ప్రపంచంలో ఏడు కథలే ఉన్నాయంటారు. ఎవరు చెప్పినా వాటిలోంచి తిప్పితిప్పి చెప్పాల్సిందే. ఈ సినిమాకి సంబంధించి చివరి 20 నిమిషాలే బలం. అలాంటి క్లైమాక్స్‌ని ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ తియ్యలేదు. వేణు ఓ సున్నితమైన పాయింట్ బాగా డీల్ చేయగలిగాడు. స్నేహితులుగా ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి చివరివరకు తమ అనుబంధాన్ని అలాగే కొనసాగించలేరా... అనే పాయింట్‌ని గొప్పగా చెప్పారు. ఇప్పటివరకు తెరమీద ప్రకాశ్‌రాజ్, నేను తండ్రీకొడుకులుగా బాగా సరిపోయాం. ఈ సినిమాలో నా తండ్రిగా తనికెళ్ల భరణి బ్రహ్మండంగా చేశారు. క్లైమాక్స్‌లో ఆయన సంభాషణలు చెప్పిన విధంగానీ, ఆయన హావభావాలు కానీ అత్యుత్తమం.
లక్కీ గర్ల్ హన్సిక
నేను, నవదీప్, శ్రుతిహాసన్ మొదటే ఫైనలైజ్ అయినా హన్సిక ఆ పాత్రకి చివరగా ఎంపికైంది. ఆమెకి ఈ ఏడాది తెలుగులో 'కందిరీగ', తమిళంలో 'వేలాయుధం' వంటి హిట్స్ వచ్చాయి. ఆమె ఈ సినిమాకి లక్కీ అవుతుందనుకున్నా. అలాగే అయ్యింది. శ్రుతి, నవదీప్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
నాలుగు భాషా చిత్రాలు
2012 నాకు మరపురాని సంవత్సరం కాబోతోంది. నాలుగు భాషలు - తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్‌లో నా సినిమాలు రాబోతున్నాయి. హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో చేస్తున్న 'చష్మే బద్దూర్', ఇంగ్లీష్‌లో దీపా మెహతా డైరెక్షన్‌లో చేస్తున్న 'విండ్స్ ఆఫ్ చేంజ్' వచ్చే ఏడాది రాబోతున్నాయి. దీపాతో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఆమె పర్‌ఫెక్షనిస్ట్. బుకర్ ఆఫ్ బుకర్స్‌గా ప్రశంసలు పొందిన సల్మాన్ రష్డీ నవల 'మిడ్‌నైట్ చ్రిల్డన్' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో నిడివి పరంగా పెద్దది కాకపోయినా కథకి కీలకమైన పాత్ర చేస్తున్నా.

No comments: